నాగిరెడ్డిపేట్, జూన్ 27: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని మాటూర్ గ్రామం మెరుస్తున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న పల్లెప్రగతి నిధులతో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో గ్రామం ఆకుపచ్చగా మారింది. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో వైకుంఠధామం, ప్రకృతివనం, డంపింగ్యార్డు, మంకీఫుడ్కోర్టు, అవెన్యూ ప్లాంటేషన్ పనులన్నీ పూర్తిచేసుకొని ఇతర గ్రామాలతో అభివృద్ధిలో పోటీపడుతున్నది. అభివృద్ధి పనులు పూర్తికావడంతో గ్రామంలో సమస్యలకు తావులేకుండా పోయింది. గతంలో గ్రామాల్లో పనులు చేయకపోవడంతో పన్నులు వసూలు అయ్యేవి కావు. కానీ ప్రస్తుతం పల్లెప్రగతి ద్వారా గ్రామం అభివృద్ధి చెందడంతోపాటు పన్ను వసూళ్లు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో 600 మంది జనాభా. ప్రస్తుతం గ్రామంలో 850 మంది నివసిస్తున్నారు. ఇప్పటివరకు 98 శాతం పన్నులు వసూలయ్యాయి. ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజూ గ్రామంలో చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి గ్రామశివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయడంతోపాటు చెత్త సేకరించడం, బ్లీచింగ్పౌడర్ చల్లడంతో గ్రామంలో వ్యాధుల జాడ లేదు.
అందరి సహకారంతో అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నిధులతో గ్రామా న్ని అభివృద్ధి చేసుకున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతోనే ప్రగతిపనులను సకాలంలో పూర్తి చేశాం. నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-కృష్ణారెడ్డి, సర్పంచ్