వర్ని, జూన్ 22: నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో అవినీతికి తావివ్వొద్దని ప్రజాప్రతినిధులు, నాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. వర్ని మండల కేంద్రంలో నియోజకవర్గంలోని వర్ని, రుద్రూర్, చందూరు, మోస్రా, కోటగిరి మండలాల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఇండ్ల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని, అలాంటి వారు ఉంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ అవినీతి కారణంగానే భూస్థాపితం అయ్యిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని వర్ని, చందూరు, మోస్రా, రుద్రూర్, కోటగిరి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ.73 కోట్ల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. మెదక్ బీదర్ హైవే నిర్మాణం కోసం రూ.550 కోట్లు మంజూరయ్యాయని, పనులు త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.
జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలకు రూ.106 కోట్లు మంజూరయ్యాయని, పనులు పూర్తయితే వీటి కింద పది వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నీటితో మంచిప్ప రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేందుకు వర్ని మండలం పైడిమల్, సిద్ధాపూర్ గ్రామాల వద్ద చెరువులను నిర్మిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.72.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించారు. సమావేశంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, జడ్పీటీసీ సభ్యులు హరిదాస్, భాస్కర్రెడ్డి, నారోజి గంగారాం, ఎంపీపీలు పిట్ల ఉమాశ్రీరాములు, అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, వర్ని ఏఎంసీ చైర్మన్ బందెల సంజీవులు, కో-ఆప్షన్ సభ్యులు కరీం, మస్తాన్, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, వెలగపూడి గోపాల్, కల్లాలి గిరి, పత్తి లక్ష్మణ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, విండో అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.