నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 18 : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీల్లో జీపీ భవనాలకోసం నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మండలంలోని గాంధీనగర్ తండాను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వివిధ సమస్యలపై అందజేసిన వినతులను స్వీకరించారు. వాటిని పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న రాష్ర్టాలతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ సూచించినట్లుగా.. చిన్నపంచాయతీలను ఏర్పాటు చేస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందన్న ఉద్దేశంతో 500 జనాభా ఉన్న తండాలు, పల్లెలకు పంచాయతీ హోదా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలువాలని కోరారు. గ్రామాన్ని సందర్శించిన బాజిరెడ్డిని స్థానికులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు సర్పంచ్ అనూషా లక్ష్మణ్ కూతురి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, ఎంపీటీసీ అంకల గంగాధర్, సర్పంచులు అశోక్, నగేశ్, సునీత రాంగోపాల్రెడ్డి, లావణ్యా ప్రవీణ్గౌడ్, జలంధర్గౌడ్, హరినాయక్, టీఆర్ఎస్ నాయకులు మారయ్య, గాజుల శంకర్, గోపాల్నాయక్, గంగారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.