మారిన గీతన్న రాత
కోటగిరి, నవంబర్ 13 : ఉమ్మడి రాష్ట్రంలో సీమాంద్ర పాలకుల హయాంలో ఉనికి కోల్పోయిన గీతవృత్తికి స్వరాష్ట్రంలో పూర్వ వైభవం వస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ బతుకులు మారడం లేదని మదనపడిన గౌడన్నల తలరాత స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది.. తాతలు.. తండ్రుల వారసత్వంగా వచ్చిన గీత వృత్తిని నమ్ముకుని ఎంతో మంది కార్మికులు కుటుంబాలను పోషిస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో సరైన ఆదరణ లేకుండే. ఈత,తాటి చెట్ల నుంచి సహజ సిద్ధమైన కల్లును సేకరించి గ్రామాల్లో విక్రయించి ఉపాధి పొందడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించిన గౌడన్నల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కాలక్రమేణా ప్రశ్నార్ధకమైంది.
ప్రమాదవశత్తు చెట్టు పైనుంచి కింద పడి మృతి చెందితే ఆరకొర నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపు కోవడంతో వారిపైనే ఆధారపడిన కుటుంబాలు రోడ్డునపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయస్సు పైపడి గీత వృత్తి చేయలేని వారి పరిస్థితైతే మరీ దారుణం.. పనులు లేక పస్తులున్నా సరే పింఛన్లకు తావే లేకుండే. లైసెన్సులు పొందడం, కల్లు విక్రయించడం ఎంతో సాహసంతో కూడుకున్న పనిగా మారింది. దీంతో చాలా మంది గీత కార్మికులు పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగించేవారు. కానీ స్వరాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాకా.. గీత వృత్తికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. గీత కార్మికులను, గౌడన్నలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.. కులవృత్తికి జీవం పోశారు. గీత కార్మికులకు ప్రమాదవశాత్తు మృతి చెందితే అందుతున్న ఎక్స్గ్రేషియాను రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ 50 ఏండ్లకే రూ.2016 ఆసరా పింఛన్లను అందజేస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రమాద తీవ్రతను బట్టి బీసీ కార్పొరేషన్ ద్వారా తక్షణ సాయంగా రూ.15-25 వేలు చెల్లిస్తున్నారు. టీఎఫ్టీ లైసెన్సులు సైతం సులభతరం చేసి ఫీజులను పూర్తిగా రద్దు చేశారు. గతంలో ఎన్నుడూ లేని విధంగా వైన్షాపుల్లో గౌడ కులస్తులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గొప్ప నిర్ణయం తీసుకోవడంతో పనులు లేక పట్టణాలకు వెళ్లిన గౌడ బిడ్డలు, గీత కార్మికులు గ్రామాలకు వచ్చి సంతోషంగా కులవృత్తిని చేపడుతున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు కల్లుగీత లైసెన్స్ రెన్యువల్, రెంటల్ ఫీజు, ఇతరాత్రా ఫీజులు చెల్లించేందుకు పడే బాధలు వర్ణణాతీతం. గీత కార్మికులు పనులన్నీ వదులుకొని ఎక్సైజ్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి. ఇవన్నీ గుర్తించిన సీఎం కేసీఆర్ మొదటగా రెంటల్ విధానాన్ని రద్దుచేసి గౌడన్నలకు అండగా నిలిచి కార్మికులకు గీత వృత్తిపై భరోసా కల్పించారు.
ఆ తర్వాత చెట్లపై విధించే పన్ను రద్దు చేయడం, లైసెన్స్ రెన్యువల్ను ఐదేండ్లకొకసారి చేసి.. దాన్ని మళ్లీ ఇటీవలే పదేండ్లకొకసారి చేసి నిర్ణయం తీసుకుని గీత వృత్తికి ప్రాణం పోశారు. కల్లు విశిష్టతమ తెలియ పరిచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూనే హైదరాబాద్లో సీమాంధ్రులు మూసి వేయించిన కల్లు దుకాణాలు మళ్లీ తెరిపించి.. కులవృత్తికి మరోసారి అండగా నిలవడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న గుడుంబాను గ్రామాల నుంచి పూర్తిగా తరిమికొట్టారు. ఇప్పుడు కొత్తగా వైన్స్షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో గౌడ బిడ్డలు లైసెన్స్లు పొంది ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
కార్మికులకు అందుతున్న సంక్షేమ పథకాలు
గీత కార్మికులు ప్రమాదవశత్తు చెట్టుపై నుంచి కిందపడి మృతి చెందినా.. శాశ్వత వైకల్యం పొందినా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కేవలం రూ.2లక్షలు మాత్రమే పరిహారంగా అందజేసేవి. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ రూ.5లక్షల పరిహారాన్ని అందజేస్తున్నది. గతంలో కార్మికులకు పింఛన్ అనే ముచ్చటే లేకుండే..కానీ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి కార్మికుడికీ రూ.2016 పింఛన్ అందిస్తూ ఆర్థికంగా అండగా ఉంటుండగా.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా మంది కార్మికులు ప్రతి నెలా పింఛన్ పొందుతున్నారు. వృత్తిని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యం తో హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్, ఆటవీ శాఖల ఆధ్వర్యంలో ఈత, తాటి మొక్కలను నాటారు. ప్రమాదవశాత్తు కార్మికులు గాయపడితే బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రమాద తీవ్రతను బట్టి రూ.15-25 వేలు తక్షణ సాయంగా అందజేసి కుటుంబాలకు కొండంత అండగా ఉంటున్నది తెలంగాణ సర్కార్.
చెట్ల పెంపకంపై దృష్టి
కల్తీ కల్లు నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈత, తాటి వనాలను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా తమ శాఖ ఆధ్వర్యంలో గీతకార్మికులు,ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ వేల సంఖ్యలో మొ క్కలు నాటాం. అంతే కాకుండా కార్మికులకు అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందిస్తున్నాం. లైసెన్సులు, దుకాణాల ఏర్పాటు విషయంలో పూర్తి అండగా ఉంటున్నాం. ఈ ఏడాది కొత్తగా ఎంతో మందికి టీఎఫ్టీ లైసెన్సులు సైతం అందజేశాం.
– రూప్సింగ్, ఎక్సైజ్ సీఐ, బోధన్
గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం అన్ని రకాలుగా గీత వృత్తికి తోడ్పాటు అందిస్తుండడంతో ఈత కల్లుకు గ్రామాల్లో ఆదరణ పెరుగుతున్నది. కార్మికులకు చేతినిండా పని లభిస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో ఆదరణ కోల్పోయిన కల్లుకు స్వరాష్ట్రంలో మంచి రోజుల వచ్చాయి. హరితహారంలో భాగంగా ఈత చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అభినందనీయం. కొత్తగా వైన్స్ దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎంతో ఉపయోగకరంగా ఉన్నది.
-డి.గంగాధర్గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు,కోటగిరి
మంచి ఆదరణ లభిస్తుంది..
తెలంగాణ గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభు త్వం చేపడుతున్న సంస్కరణలు చాల బాగున్నా యి. స్వచ్ఛమైన కల్లులో ఎన్నో ఔషధ గుణాలు, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఎన్నో సుగుణాలున్నాయి. దీన్ని ప్రభుత్వం గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వడం బాగుంది. గీత కార్మికులకు ఉపయోగపడే విధంగా పథకాలు, సబ్సిడీలు అందజేస్తూ ప్రమాద బీమా రూ.5లక్షలు చేయడం, గాయపడిన కార్మికులకు తక్షణ సాయం అందించడంతో వృత్తికి ఆదరణ లభిస్తుంది.
– శంకర్గౌడ్, గీతపా రిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు,కోటగిరి