దేవతల గణాధిపతి, తొలి పూజ్యనీయుడైన విఘ్నేశ్వరుడిని కొలిచే వేళైంది. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో ప్రతిమలను ప్రతిష్ఠించనుండగా, నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉండగా, మట్టి గణపతికే ప్రజానీకం మొగ్గుచూపుతున్నది. పూజకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో మార్కెట్కు తరలిరాగా సందడి కనిపించింది.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ) /నిర్మల్ అర్బన్/తానూర్ , ఆగస్టు 30 : ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టూ పుట్టా.. తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పర్వదినం నాడు వీధివీధినా వినాయక విగ్రహాలను నెలకొల్పి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 31న వినాయక చవితి కోసం ఊరూరా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్లలో సందడి కనిపిస్తున్నది. పూజకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు మహిళలు మంగళవారం పెద్ద సంఖ్యలో మార్కెట్లకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మట్టి గణపతులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నారు.
మట్టి ప్రతిమలే మేలు..
బంకమట్టితో రూపొందించే విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. చెరువు దరిలో బంకమట్టికి కొదవ ఉండదు. ఈ మట్టితో చేతిలో ఇమిడే విగ్రహాలు మొదలుకొని, కంకబొంగులు, జనుపనార, గడ్డి, పీచు సాయంతో ఎత్తైన విగ్రహాలనూ రూపొందించవచ్చు. వీటికి సహజ రంగులు అద్దితే ఆకర్షణలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ మట్టితో విగ్రహాలను తయారు చేసినప్పుడు మట్టిలోని ధాతువులు మనుషులకు అంటుకొని ఆరోగ్యాన్నిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మట్టి వాసన కూడా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతుంది. ఈ విగ్రహాలు నీటిలో వేసిన గంటలో కరిగిపోవడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో పెనుముప్పు..
యేటా వినాయక చవితి కోసం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వేలాది ప్రతిమలు ప్రతిష్ఠిస్తారు. వీటిలో ఎక్కువ శాతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర రసాయనాలతో చేసినవే పెడుతుంటారు. చివరి రోజున ప్రతిమలను భక్తులు నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ ప్రతిమల తయారీలో వినియోగిస్తున్న రసాయనాలు నీటిలో కరిగి కాలుష్యమవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులతో ఆకర్షణీయంగా తయారు చేసే భారీ విగ్రహాల వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. ఈ తరహా విగ్రహాల్లో జిప్సం, సల్ఫర్, పాస్పరస్, మెగ్నీషియంలాంటి మూలకాలు కలుస్తాయి. ఇవి నీటిలో సులువుగా కరగవు. పైగా నీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుపడి భూగర్భ జలాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఒక్కసారిగా వందలాది విగ్రహాలను వేస్తే నీటిలో ఆమ్లత్వం, భారలోహాల సాంద్రత పెరిగి చేపలు సహా ఇతర జలచరాలు చనిపోయే ప్రమాదముంది. మంచినీటి చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఆ నీటిని తాగినవారికి శ్వాస, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ఇక వేడుకల్లో చల్లుకునే కృత్రిమ రంగుల్లో కాపర్సల్ఫేట్, లెడ్ఆక్సైడ్, మెర్క్యూరీ సల్ఫేట్ లాంటి రసాయనాలు ఉంటాయి. ఇలాంటి సింథటిక్ రంగుల వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
పలువురికి ఆదర్శం
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల పర్యావరణ ప్రేమికులు మట్టి గణపతి విగ్రహాలనే ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ హితాన్ని కోరుకునేవారు మట్టి విగ్రహాలను ఊరూరా ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. మట్టి ప్రతిమల వాడకంతో కలిగే ప్రయోజనాలు, పీవోపీ, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకటనలు, కరపత్రాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో మట్టి విగ్రహాలను తయారు చేయించి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచిర్యాలకు చెందిన పర్యావరణ ప్రేమికుడు, ఉపాధ్యాయుడు గుండేటి యోగేశ్వర్ ఏటా మట్టి విగ్రహాల ఆవశ్యకతను ప్రజలకు, విద్యార్థులకు వివరిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకాన్ని నివారించి, మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని అవగాహన కల్పిస్తున్నారు.
విగ్రహాల తయారీలో సోదరులు
చెన్నూర్ పట్టణానికి చెందిన సోదరులు కే.దత్తుమూర్తి, శ్రీమూర్తి యేటా మట్టి వినాయకులను తయారు చేస్తుంటారు. వాటికి నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భీమారం మండలకేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్న శ్రీమూర్తి యేటా విద్యార్థులతో పాటు తానూ ‘మట్టి ప్రతిమలను తయారు చేస్తున్నారు. వృత్తి రీత్యా సైన్స్ ఉపాధ్యాయుడు కావడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కలిగే నష్టాలను బోధనల ద్వారా, కరపత్రాలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వారి పిల్లలు శాంకరి, శ్రీవత్స కూడా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తుండడం గమనార్హం.
16 ఏళ్లుగా..
తాండూర్, ఆగస్టు 30 : తాండూర్కు చెందిన అభినవ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కేసెట్టి సంతోశ్కుమార్ 16 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కలిగే ముప్పును వివరిస్తూ, ఏటా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నారు. 10,116 మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు ఇప్పటికే అందజేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వినియోగించవద్దని, నీటిని సైతం కలుషితం చేయవద్దని సూచిస్తున్నారు.
యేటా 100 వినాయకులు..
చెన్నూర్ రూరల్, ఆగస్టు 30 : చెన్నూర్ మండలకేంద్రంలోని పెండ్లి పోచమ్మ వాడకు చెందిన రెడ్డి మహేశ్ 12 ఏండ్లుగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నాడు. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే మహేశ్ ప్రవృత్తిగా ఏటా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తూ పలువురికి పంపిణీ చేస్తున్నాడు. యేటా 100 విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరగడంతో ఆర్డర్లు ఇస్తే పెద్ద విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఈ యేడాది ఇప్పటి వరకు 100కుపైగా మట్టి విగ్రహాలను తయారు చేశాడు.
మట్టి గణపతులను పూజించాలి
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 30 : మట్టి గణపతులను ప్రతిష్ఠించి, వాటికే పూజ చేయాలి. పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను నివారించాలి. విద్యార్థులు, ప్రజలకు యేటా కరపత్రాలు, వివిధ ప్రసార మాధ్యమాలు, కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలల్లోనూ విద్యార్థులతో మట్టి విగ్రహాలను తయారు చేయించి, వాటికే పూజలు చేసేలా వివరిస్తున్నాం. పర్యావరణం బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని గుర్తుంచుకోవాలి.
– గుండేటి యోగేశ్వర్, పర్యావరణ ప్రేమికుడు, సైన్స్ ఉపాధ్యాయుడు, మంచిర్యాల