నిజామాబాద్ రూరల్, ఆగస్టు 19:నిజామాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనున్నది. నిజామాబాద్ – హైదరాబాద్ వెళ్లేదారిలో కీలకంగా ఉన్న మాధవనగర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. రైళ్ల రాకపోకల సమయంలో మాధవ్నగర్ ట్రాక్ వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయడంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనాలు నిలిచే పరిస్థితి నెలకొంటున్నది. అనారోగ్యంతో, పరిస్థితి విషమంగా ఉన్న అంబులెన్స్లో హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైలు కూడా అదే సమయంలో వస్తే రైల్వే గేటు పడిన కారణంగా 5 నుంచి 10 నిమిషాలు ఆగాల్సి వస్తున్నది. రైళ్ల రాకపోకలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఆ సమస్యను అధిగమించటానికి ఈ ట్రాక్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించడమే ఏకైక మార్గమని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సైతం ఆర్వోబీ నిర్మాణంపై అప్పటి ఎంపీ కవితకు వివరించారు. దీంతో కల్వకుంట్ల కవిత పార్లమెంట్ సమావేశాల్లో మాధవ్నగర్ వద్ద ఉన్న రైల్వేట్రాక్పై ఆర్వోబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పలుమార్లు కోరారు. అంతేగాకుండా అప్పటి రైల్వేశాఖ మంత్రి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆర్వోబీ నిర్మాణానికి కేవలం రూ.10కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ నిధులు ఏమాత్రం సరిపోవని పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని అనేకసార్లు విన్నవించగా మరో రూ.20కోట్లు మంజూరు చేసింది.
కేంద్రం మంజూరు చేసిన రూ.30కోట్లు ఆర్వోబీ నిర్మాణానికి ఏ మాత్రం సరిపోలేని పరిస్థితి నెలకొనడంతో పనులు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ చూపి ఆర్వోబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి కోరారు. కేంద్రం చాలీచాలనీ నిధులు మంజూరు చేయడంతో ఆర్వోబీ పనులు ప్రారంభించలేని దుస్థితి ఏర్పడిందని, రాష్ర్టానికి చెందిన వాటా నిధులు ఎక్కువగా కేటాయించాలని విన్నవించగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రూ.63.12 కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్రం నిధులు రూ.30 కోట్లు, రాష్ట్రం వాటా నిధులు రూ.63.12 కోట్లు కాగా మొత్తం 93.12 కోట్లతో ఆర్వోబీ నిర్మాణ పనులను ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు ప్రారంభించారు. ంక్రీటింగ్ పనులు ప్రారంభం..ఆర్వోబీ నిర్మాణం కోసం ప్రస్తుతం తొలుత పైల్ టెస్ట్ కాంక్రీటింగ్ పనులను ఆర్అండ్బీ అధికారులు ప్రారంభించారు. ఈ ఆర్వోబీ నిర్మాణంలో మొత్తం 170 పైల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. పైల్స్ కాంక్రీటింగ్ పనులు పూర్తయ్యాక 28రోజుల పాటు వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
భూనిర్వాసితులకు రూ.2.68కోట్ల పరిహారం..
ఆర్వోబీ నిర్మాణం కింద భూమి, నివాసపు ఇండ్లు కూలిపోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితమే పరిహారం డబ్బులను వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. మాధవ్నగర్ ఆర్వోబీ నిర్మాణ స్థలం కింద నిజామాబాద్ రూరల్ మండలంలోని పాంగ్రా శివారులో 34 1/2 గుంటల భూమిని నిర్వాసితుల నుంచి రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఇందులో 11 ఇండ్లతోపాటు పలువురి భూమి ఉంది. వీరికి ప్రభుత్వం పరిహారం కింద కోటీ20 లక్షల రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ శివారులో ఉన్న 2 ఎకరాల 36 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు ఆర్వోబీ నిర్మాణం కోసం కేటాయించారు. ఇందులో ఆరు ఇండ్లతో పాటు పలువురి భూమి ఉన్నది. ఇక్కడి నిర్వాసితులకు కోటీ48 లక్షల రూపాయలు పరిహారం కింద అధికారులు చెల్లించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తమకు చెల్లించిన పరిహారం సరిపోనందున మరింతగా పెంచి ఇవ్వాలని భూనిర్వాసితులు నిజామాబాద్ ఆర్డీవో రవికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఓకేషన్ 2013 యాక్ట్ ప్రకారం ఆర్డీవో హైకోర్టు ప్రాంగణంలోని అథారిటీ కోర్టుకు భూనిర్వాసితుల విన్నపాన్ని ప్రస్తావిస్తూ నివేదికను సమర్పించారు. పరిహారం డబ్బులు అందుకున్న నిర్వాసితులు అధికారులు మార్కింగ్ చేసిన ప్రకారం తమ ఇండ్లను జేసీబీ ద్వారా కూలగొట్టి చదును చేస్తున్నారు.
నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు
మాధవ్నగర్ ఆర్వోబీ నిర్మాణానికి సరిపడా నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఆర్వోబీ నిర్మాణానికి కేంద్రం చాలీచాలనీ నిధులు కేటాయించింది. అవి సరిపోలేని పరిస్థితి ఉండడంతో ఎమ్మెల్సీ కవిత, నేను, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలిసి సీఎం కేసీఆర్కు విన్నవించాం. సీఎం సానుకూలంగా స్పందించి రూ.63.12 కోట్లు మంజూరు చేశారు. ఆర్వోబీ నిర్మాణం పనులు ప్రారంభమైనందున త్వరలోనే వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు తొలగిపోతాయి.
– బాజిరెడ్డిగోవర్ధన్,ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే
ఏడాదిన్నరలో ఆర్వోబీ నిర్మాణం పూర్తి
ప్రస్తుతం సరిపడా నిధులు ఉన్నందున ఆర్వోబీ నిర్మాణం పనులు ప్రారంభించాం. ఏడాదిన్నర కాలంలో పనులన్నీ పూర్తయి రైల్వే ఓవర్బ్రిడ్జి వినియోగంలోకి వస్తుంది.
-ప్రవీణ్ కుమార్,ఆర్అండ్బీ డీఈ