నిజామాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :నిజామాబాద్ నగరానికి చెందిన భూషణ్ ఎనిమిదేండ్ల క్రితం గల్ఫ్ దేశంలో ఉపాధి కోసం వెళ్లి అనారోగ్యంతో తిరిగొచ్చాడు. డబ్బులు సంపాదించేందుకు వెళ్లిన సదరు వ్యక్తి పని యావలో పడి తన ఆరోగ్యాన్ని పట్టించు కోలేదు. మధ్యలో పచ్చకామెర్లు సోకడం ద్వారా తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యా డు. పచ్చ కామెర్ల వ్యాధి విజృంభించి శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపింది. లేవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అతడిని గల్ఫ్లోని స్నేహితులే డబ్బులు పోగేసి ఇంటికి చేర్చారు. తీరా ఇక్కడి వచ్చాక దవాఖానల చుట్టూ తిరిగి తల్లిదండ్రులు పోగేసిన ఆస్తులను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దినదిన గండం అన్న రీతిలో రెండు రోజులకోసారి రక్తాన్ని శుద్ధి చేయించుకుంటూ కాలం గడుపుతున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో డయాలసిస్ సేవలంటే కేవలం ధనవంతులకే సొంతం. పేదలకు ఉచితంగా అందే పరిస్థితి లేకపోయేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన కొద్ది రోజుల తర్వాత డయాలసిస్ సేవలు ఉచితంగా అందడంతో భూషణ్ లాంటి ఎంతో మందికి మేలు చేకూరుతున్న ది. ఇప్పుడిలాంటి ఎంతో మంది విధి వంచితులకు ప్రభుత్వం మానవీయతతో పింఛన్లు పంపిణీకి సిద్ధమవ్వడంతో డయాలసిస్ బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
236 మంది బాధితులు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం ఆయా ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సేవలు పొందుతున్న వారి సంఖ్య దాదాపు 236గా ఉంది. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో 120 మంది, బోధన్లో 43, కామారెడ్డిలో 20, బాన్సువాడలో 53 మంది నిత్యం ఉచితంగా రక్తశుద్ధి చేయించుకుంటున్నారు. అయితే ఉభయ జిల్లాలకు చెందిన మరికొంత మంది బాధితులు వారి స్థోమతను బట్టి ప్రైవే టు దవాఖానల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆగస్టు 6న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో వైద్యారోగ్య శాఖ లెక్కలను తీస్తోంది. డయాలసిస్ రోగులకు పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరలోనే వెలువడే ప్రకటన మేరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి పింఛన్ కోసం బాధితులే దరఖాస్తు చేయడం ద్వారా త్వరలోనే కచ్చితమైన సమాచారం రానున్నది. ప్రస్తుతం రక్తశుద్ధి చేయించుకుంటున్న వారితో పోలిస్తే సంఖ్య మరింతగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
నిత్య జీవన పోరాటం…
డయాలసిస్ బాధితుల జీవితాలు నిత్యం నరకప్రా యం. రోజు తప్పించి రోజు… లేదంటే రెండు రోజులకోసారి ఇలా వ్యాధి తీవ్రతను బట్టి రక్త శుద్ధి చేయించుకోవడం కత్తిమీది సాము. దినదినం ప్రాణాలతో కుస్తీ పడుతూ జీవనం సాగిస్తున్న వీరందరికీ కేసీఆర్ సర్కారు కొండంత అండగా నిలిచింది. గతంలో డయాలసిస్కు డబ్బులు పెట్టలేక ప్రాణాలు విడిచినవాళ్లే. స్థోమత ఉన్నన్ని రోజులు మాత్రమే వైద్యం చే యించుకుని ఆ తర్వాత చేతులు ఎత్తేసిన పరిస్థితి అనే క కుటుంబాల్లోనూ ఎదురైన అనుభవాలే. ఇలాంటి అభాగ్యులెందరికో సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం అం దించి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితం గా రక్త శుద్ధిని చేయిస్తున్నారు. తాజాగా డయాలసిస్ బాధితులకు సీఎం కేసీఆర్ పెన్షన్ మంజూరుకు నిర్ణ యం తీసుకోవడంతో సంబంధీకుల్లో ఆనందం కనిపిస్తోంది.
విరివిగా డయాలసిస్ సెంటర్లు…
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ దవాఖాన, బోధన్ ఏరియా వైద్యశాలలో ప్రస్తుతం డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. వీటికి తోడుగా తాజాగా ఆర్మూర్లోని 100 పడకల దవాఖానలోనూ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల భీమ్గల్ వంద పడకల దవాఖాన శంకుస్థాపనకు వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సైతం నూతన దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా నాలుగైదు రోజుల క్రితమే డిచ్పల్లి దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ప్రజలకు మేలు చేకూరబోతోంది. కామారెడ్డిలో ఇప్పటికే జిల్లా ఏరియా దవాఖానలో సేవలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ 100 పడకల వైద్యశాల లోనూ బాధితులకు ఊరట దక్కుతోంది. ఎల్లారెడ్డి, జుక్కల్ మినహా రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ ప్రజల ముంగిట ఉండబోతోంది.