నిజామాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సహజ కాన్పుల సంఖ్యను పెంచేందుకు వైద్యారోగ్య శాఖ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. సాధారణ కాన్పులను పెంచడంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వసతులను సర్కారు కల్పిస్తున్నది. గ్రామ, మండల కేంద్రాల్లో గర్భిణుల వివరాలను సేకరించి ఇంటింటికెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు దవాఖానల్లో కడుపు కోతలు, జేబులకు చిల్లులు తప్ప ఒరిగేదేమీ లేదంటూ చెబుతున్నారు. మూడు నెలలుగా జరుగుతున్న ఈ ప్రయత్నం ఒకింత ప్రభుత్వ దవాఖానల్లో మెరుగుదల కనిపిస్తున్నది. ప్రైవేటులో మాత్రం కొన్ని దవాఖానల యాజమాన్యాలు తమకు సామాజిక బాధ్యత కన్నా పైసా వసూలే ప్రథమ కర్తవ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. ఇందుకు జూలై నెలలో జరిగిన ప్రసవాల వివరాలే తేటతెల్లం చేస్తున్నాయి. సాధారణ కాన్పు జరిగితే 3 రోజుల్లోనే బాలింతలు తమ పనులు తాము చేసుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుంది. ఆపరేషన్ల ద్వారా చేసే కాన్పులతో బాలింతలు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం తప్పదు. పైగా భవిష్యత్తులోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంకల్పంతో ప్రసవాల్లో సాధారణ పద్ధతికే మొగ్గు చూపుతూ డ్రైవ్ నిర్వహిస్తుండగా నిజామాబాద్ జిల్లాలో మాత్రం ప్రైవేటు దవాఖానల్లో తీరు మారకపోవడం విచిత్రంగా మారింది.
ఆదేశాలు బేఖాతరు చేస్తున్న ప్రైవేటు దవాఖానలు..
మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ఇందులో భాగంగా ప్రసవాల సమయంలో శస్త్ర చికిత్సలకు బదులుగా సహజ కాన్పులు చేయాలంటూ డ్రైవ్ నిర్వహిస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో గడిచిన కొద్ది రోజులుగా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించింది. శస్త్ర చికిత్సలను ప్రోత్సహించొద్దని ఆదేశాలు సైతం జారీ చేసింది. మాతాశిశు ప్రాణాలకు ఇబ్బంది ఏర్పడిన విపత్కర సమయంలో మినహా మిగిలిన అన్ని కేసుల్లోనూ సహజ కాన్పులే చేయాలంటూ ప్రభుత్వం పేర్కొంటుండగా ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవడం లేదు. పైసల కోసం కక్కుర్తి పడుతున్న యాజమాన్యాలు ఎడాపెడా శస్త్ర చికిత్సలకే ప్రాధాన్యం ఇస్తూ ఇష్టానుసారంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. 2022, జూలైలో వెలుగు చూసిన గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రైవేటు దవాఖానలో గత నెలలో మొత్తం 1158 కాన్పులు జరిగాయి. ఇందులో 998 శస్త్రచికిత్సలు (86 శాతం), 160 మాత్రమే సహజ కాన్పులు, ఉండడం విస్తూ గొల్పుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో 1189 డెలివరీలు జరిగాయి. 664 ఆపరేషన్లు, 525 సాధారణ కాన్పులు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగుదల కనిపిస్తుండగా ప్రైవేటులో మచ్చుకూ శ్రద్ధ వహించకపోవడం విడ్డూరంగా మారింది.
నోటీసులు ఇచ్చినా బుద్ధి మారదా?
నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా ప్రైవేటులో 85 నుంచి 90శాతం వరకు, ప్రభుత్వ దవాఖానల్లో 50-60శాతం వరకు సిజేరియన్లు జరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆధ్వర్యంలో పలు దఫాలు ఈ సిజేరియన్లపై సమీక్షలు నిర్వహించారు. ప్రయోజనం లేకపోవడంతో జిల్లాస్థాయి అధికారులతో 8 కమిటీలను వేసి నిజామాబాద్లోని ప్రైవేటు దవాఖానలను తనిఖీ చేయించారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో ప్రైవేటు దవాఖానల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం అడుగడుగునా కనిపించింది. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కనీసం సహజ కాన్పులు చేయడం కోసం ప్రయత్నించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఏయే దవాఖానల్లో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి? వాటిలో ఎన్ని సిజేరియన్లు జరుగుతున్నాయో జాబితాను కలెక్టర్కు అందించారు. ఈ జాబితా ఆధారంగా 84 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు అనుగుణంగా ఆయా దవాఖానలు సమాధానం ఇవ్వాలని కోరారు. వారికి ఇచ్చిన గడువులోనే దవాఖానల యజమానులు వివరణ ఇచ్చారు. నిర్లక్ష్యపూరిత సమాధానం ఇచ్చిన దవాఖానలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ సిద్ధం అవుతున్నట్లుగా తెలిసింది. ఆదేశాలను పెడచెవిన పెడుతున్న ప్రైవేటు దవాఖానల తీరుపై ప్రభుత్వం సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం..
ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు దవాఖానలో ప్రసవాలు జరిగితే వాటి వివరాలను ప్రతి నెలా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి పంపించాలి. వాటిలో సాధారణ ప్రసవాలెన్ని, సిజేరియన్లు ఎన్ని జరిగాయో పొందుపర్చాలి. సిజేరియన్లు ఎందుకు చేశారో వివరణ కూడా ఇవ్వాలి. ప్యాకేజీల పేరున గత కొన్నేండ్లుగా ప్రసవాలను చేస్తున్న ప్రైవేటు దవాఖానలు సాధారణ ప్రసవాలతో డబ్బులు తక్కువ వస్తుండడంతో అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువగా సిజేరియన్లు చేస్తున్నట్లు తనిఖీల సమయంలో అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ను సీరియస్గా అమలు చేస్తున్నారు. నిరంతర తనిఖీలతో దవాఖానల యాజమాన్యాలను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రజల్లోనూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లోనే మేలు
సహజ కాన్పులను పెంచేందుకు కొంత కాలంగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తు న్నాం. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతున్నది. అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప ఆపరేషన్లు చేయొద్దని వైద్యులకు సూచించాం. ప్రభుత్వ దవాఖానల్లోనే కాన్పులు చేయించుకోవాలని ప్రజలను కోరుతు న్నాం. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు దవాఖానలపై చర్యలు ఉంటాయి.
– సి.నారాయణ రెడ్డి, కలెక్టర్, నిజామాబాద్
ప్రజారోగ్యంపై దృష్టి..
తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రధానంగా గర్భిణులకు ప్రత్యేక సేవలందిస్తున్నది. మొదట కేసీఆర్ కిట్ అందించి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం అదే తరహాలో వైద్యసిబ్బందికి నజరాన ప్రకటించి సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు కృషి చేస్తున్నది.
– డాక్టర్ సుదర్శనం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
చాలా మంచి నిర్ణయం..
సాధారణ ప్రసవాలను పెంచేందుకు వైద్య సిబ్బందికి ప్రభుత్వం నజరాన ప్రకటించడం చాలా మంచి నిర్ణయం. వైద్యులు, నర్సులు, సిబ్బంది చాలా సంతోషపడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఎల్లప్పుడూ ప్రజల మేలు కోసమే పనిచేస్తుందని ఈ నిర్ణయంతో వెల్లడైంది.
-డాక్టర్ ప్రతిమా రాజ్, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్
ప్రత్యేక కృతజ్ఞతలు..
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు పెరిగాయి. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తున్నది. గర్భిణులకు పౌష్టికాహారం నుంచి మొదలుకొని సాధారణ ప్రసవాల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. సాధారణ ప్రసవాలు చేసే సిబ్బందికి ప్రోత్సాహకం అందించడం చాలా మంచి నిర్ణయం. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పార్వతి, హెడ్ నర్సు, ప్రభుత్వ దవాఖాన