కమ్మర్పల్లి, జూన్ 29 : గతంలో వరదలు వచ్చినప్పుడే నిండుగా కనిపించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ.. ఇప్పుడు మూడు కాలాలూ నిండు కుండలా కనిపిస్తున్నది. ‘రివర్స్ పంపింగ్’ వల్ల వరద కాలువ సజీవ ధారగా మారింది. మిగులు జలాల సద్వినియోగం కోసం నిర్మించిన ఈ కాలువ.. గత పాలకుల నిర్లక్ష్యంతో అసలు లక్ష్యం నెరవేరలేదు. ఏడేండ్లలో పూర్తి చేయాల్సిన కాలువ నిర్మాణం.. 17 ఏండ్లకు గానీ పూర్తి కాలేదు. ఈ కాలువ అసలు లక్ష్యం నెరవేరక నీరు వృథా పోయే దశలో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీకి ‘పునర్జీవం’ పోశారు. రివర్స్ పంపింగ్తో వరద కాలువకు జలకళను తీసుకొచ్చారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకోవచ్చన్న ఈ కాలువ.. ప్రస్తుతం రివర్స్ పంపింగ్తో మూడు కాలాలూ నిండుగా ఉంటున్నది. వరద కాలువకు పునాది రాయి పడి 30 వసంతాలు పూర్తవుతున్నాయి. ఎండాకాలంలోనూ కాలువలో నిండుగా ఉన్న నీళ్లను చూసి అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సారెస్పీ నిర్మాణం పూర్తయిన తొలినాళ్లలో భారీగా వరదలు వచ్చి పూర్తి స్థాయిలో నిండినప్పుడు మిగులు జలాలను ప్రాజెక్టు నుంచి దిగువన గోదావరిలోకి వృథాగా విడుదల చేసే వారు. నీరు వృథా పోకుండా వినియోగించుకోవాలన్న ఆలోచనతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాల మెట్ట భూములకు ఈ మిగులు జలాలను అందించాలన్న లక్ష్యంతో వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టారు.
దీనికి నిజామాబాద్ జిల్లా పాత బాల్కొండ మండలం పరిధిలోని..నేటి మండల కేంద్రమైన ముప్కాల్ శివారులో అప్పటి ప్రధాని పీవీ నర్సింహరావు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో సముద్ర మట్టం 1070 అడుగుల వద్ద ఆరువరద గేట్లతో హెడ్ రెగ్యులేటర్ను, 1074 అడుగుల నీటి మట్టం ఉన్నంత వరకు వరద కాలువకు మళ్లించేలా హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ను నింపుతూ..మధ్యతో వీలున్న చోటల్లా జలాశయాలు నిర్మించి నీటిని వాడుకునేలా డిజైన్ చేశారు. ఏడేండ్లలో కాలువ నిర్మాణం పూర్తి చేయాలని పునాది పడిన సమయంలో పెట్టుకున్న లక్ష్యం అప్పటి, అటు తర్వాత పరాయి పాలకుల వివక్షతో నెరవేరలేదు.
గత పాలకుల నిర్లక్ష్యంపై పోరు..
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులపై సీమాంధ్ర పాలకుల వివక్షను కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడికక్కడ ఎండగట్టారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ నిర్మాణంలో పాలకుల తీవ్ర నిర్లక్ష్యం, అలసత్వంపై ఉద్యమ నాయకులు పోరాడారు. దీంతో ఎట్టకేలకు కాలువ పనులు కానిచ్చి 2010 జూలై 31న రెండు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటి విడుదలతో ట్రయల్ రన్ నిర్వహించారు. 122వ కిలో మీటరు వరకు నీటిని విడుదల చేసి కాలువ కర కట్టల నాణ్యతను పరిశీలించారు.
కాలువ పూర్తయింది సరే..మిగులు జలాలు కాదు కదా ప్రాజెక్టు నిండడమే కష్టమనే పరిస్థితి వచ్చి పడింది. ఎగువన మహా రాష్ట్రలో భారీ వర్షాలు పడితే నిండినట్లు.. లేదంటే ప్రాజెక్టు ఆయకట్టు ఎండినట్లు అనే పరిస్థితులు క్రమంగా తలెత్తాయి. ప్రాజెక్టుకు నీటి లభ్యత రానురాను ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి దుస్థితిలో పడిపోయిన ప్రాజెక్టు నుంచి వరద కాలువకు జలాలు రాని దుస్థితి నెలకొన్నది. చివరకు మిగులు జలాలు లేకున్నా ఉన్న జాలాల నుంచే దిగువ మానేరుకు నీటిని అందించే కాలువగా వరద కాలువ మారి పోయింది. ఇలా కాలువకు నీటి మూలమైన ఎస్సారెస్పీలోనే నీరు లేని రోజులతో వరద కాలువ ఎండి పోయి తుమ్మ మొద్దులు, తూటి పొదలు నిండిన మోడు కాలువగా మారి పోయింది. నీరు లేక విశాలమైన కాలువలో కుర్ర కారు ఏండ్ల పాటు క్రికెట్ ఆడేసుకున్నారంటే కాలువ ఎంతలా మోడు వారి పోయిందో అర్థం చేసుకోవచ్చు.
కాళేశ్వరంతో జీవం..
స్వరాష్ట్రంలో ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నిర్మించిన కేసీఆర్.. వరద కాలువ ఆధారంగా కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా దిగువ నుంచి ఎగువకు నీటిని ప్రవహింప జేసి ఎస్సారెస్పీకి అందిచేలా ఎస్సారెస్పీ పునర్జీవం పథకాన్ని తెచ్చారు. రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పథకాన్ని కేసీఆర్ దిశా నిర్దేశంలో పూర్తి చేయించారు. ఎస్సారెస్పీ నిండని పరిస్థితుల్లో ఏటా 60 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించే పునర్జీవం పథకంతో ఇప్పుడు ఏటా కాళేశ్వరం జలాలతో వరద కాలువను మూడు కాలాల పాటు నిండుగా ఉంచుతున్నారు. దీంతో ఒకప్పుడు బీడు వారిన వరద కాలువ నేడు జలకళను సంతరించుకున్నది. మూడు కాలాలు నిండు కుండలా ఉండడంతో నిత్యం కాలువ వెంట దాహార్తి తీర్చుకుంటున్న జీవాల సందడి, వన్య ప్రాణుల కదలికలు కనిపిస్తున్నాయి. మత్స్య సంపద అభివృద్ధికి పుష్కల జల వనరుగా నిలుస్తున్నది.
6,500 ఎకరాలకు సాగునీరు
వరద కాలువలో తక్కువ ఎత్తులో నూతనంగా నిర్మించిన భారీ తూముల ద్వారా 101 కిలో మీటర్ల పొడవునా వరద కాలువ వెంట 6,500 ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు నీరు అందుతున్నది. చెరువులు నిండు కుండల్లా ఉంటున్నాయి. ఎస్సారెస్పీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నా జిల్లాకు దాని ప్రయోజనం తక్కువగా ఉందనే బాధ ఉండేది. కానీ కాకతీయ కాలువకు వరద కాలువ తోడవ్వడంతో జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గానికి సాగు నీటి ప్రయోజనం పెరిగింది. నేటితో 30వ వసతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరద కాలువ పునర్జీవం పథకం ద్వారా ఏకంగా ఇటు ఎస్సారెస్పీ-అటు కాళేశ్వరం నుంచే వచ్చే వరద జలాశయంగా మారిన వైనాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.