నిజామాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి);‘బైబై మోదీ..’ ఇప్పుడు ఏ సోషల్ మీడియా వేదిక చూసినా ఇదే హ్యాష్ట్యాగ్ కనిపిస్తున్నది. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ట్రోలింగ్ నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తల్లడిల్లుతున్న సామాన్య ప్రజలు.. మోదీ, బీజేపీపై రుసరుసలాడుతున్నారు. ‘సోషల్’ వేదికగా తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, సామాన్యులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. జాతి భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో ‘అగ్నిపథ్’ వంటి సంస్కరణలు.. ఇలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ‘నెట్’ ఇంట తమ నిరసనలు తెలుపుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్.. ఇలా ఏ సోషల్ మీడియాలో చూసినా మాకొద్దీ మోదీ అన్న అర్థం వచ్చేలా ‘బైబై మోదీ’ హ్యాష్ ట్యాగ్ను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. దీంతో బీజేపీలో కలవరం మొదలైంది. బైబై మోదీ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా బైబై మోదీ నినాదమే కనిపిస్తున్నది. మాకొద్దీ మోదీ అన్న అర్థం వచ్చేలా ఆంగ్లంలో బైబై మోదీ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రజా అవసరాలు తీర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిన బీజేపీ సర్కారు తీరుకు ఈ అంశం నిదర్శనంగా నిలుస్తున్నది. అతి తక్కువ సమయంలో ఊహించని రీతిలో బైబై మోదీ విస్తృతంగా విస్తరించడంతో కమలం పార్టీలో కలవరం మొదలైంది. మరో ఏడాదిన్నర కాలంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కమలం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.
వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి విషయాలపై ప్రజలు ఎవరికి వారే స్పందిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తోపాటు వాట్సాప్లోనూ బైబై మోదీ హోరెత్తుతున్నది. అగ్నిపథ్తో యువత ఆగ్రహానికి గురైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడేకంగా అన్నివర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లుగా ఈ అంశంతో స్పష్టం అవుతున్నది. ఎనిమిదేండ్ల మోదీ సర్కారు పాలనలో అమాంతం పెరిగిన ద్రవ్యోల్బణంతో ప్రజలు జీవించలేక చతికిల పడుతుంటే అందుకు విరుద్ధమైన అసత్య ప్రచారాలతో బీజేపీ పబ్బం గడుపుతున్నది.
బీజేపీ బాటలోనే..
తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్లు అన్న చందంగా మారింది భారతీయ జనతా పార్టీ తీరు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని దశాబ్ద కాలంగా విష ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారికి అదే వేదిక నుంచి రివర్స్ పంచ్లు పడుతున్నాయి. బీజేపీ చేస్తున్న అలజడిని గుర్తించిన సామాన్య జనమంతా ఇప్పుడు స్వచ్ఛందంగా కమలం మాయ నుంచి తేరుకొని ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపడుతూ చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. అసత్యాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ… పబ్బం గడుపుతున్న భారతీయ జనతా పార్టీ అబద్ధాల గుట్టును ఎక్కడికక్కడ రట్టు చేస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక రకంగా, బీజేపేతర రాష్ర్టాల్లో మరో రకంగా వ్యవహరిస్తూ సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్న వైనంపై మేధావీ వర్గం, యువత స్పందిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై చూపుతున్న వివక్షను ఎండగడుతూ ఈ మధ్య కాలంలో బైబై మోదీ పేరుతో మొదలైన హాష్ట్యాగ్ ఉద్యమం దేశంలోనే నంబర్ వన్ ట్రెండింగ్లో నిలుస్తుండడం విశేషం. ఇప్పుడీ అంశం జాతీయ స్థాయిలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ సందర్భంలో యూపీఏ ప్రభుత్వంపై మోదీ మాట్లాడిన సందేశాలను సైతం ఈ సందర్భంగా ఉటంకిస్తూ వీడియోలను రిలీజ్ చేస్తుండడంతో బీజేపీ మాటెత్తడం లేదు.
ఆలోచింపజేస్త్తున్న పోస్టులు..
కశ్మీర్ నుంచి కేరళ వరకు, గుజరాత్ నుంచి అసోం వరకు దేశంలో ఏ మూలకు వెళ్లినా 2014 నుంచి ఈ దేశాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వం సాధించిందేమీ లేదు. లక్షల కోట్ల అప్పులు, దేశంలోని రాష్ర్టాలకు మొండి చేయి చూపడం.. దౌత్యం పేరుతో విదేశాలకు ఇబ్బడిముబ్బడిగా రుణసాయం చేయడం, చీటికి మాటికీ విదేశీ టూర్లతో ప్రజల్లో ఓ రకమైన అటెన్షన్ క్రియేట్ చేయడం.. దాని వెనుక తన అనుంగ కార్పొరేట్ దిగ్గజ మిత్రులకు లాభం చేకూర్చే పనులు చక్కబెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నట్లుగా అర్థం అవుతున్నది. ఆఖరికి దేశానికి రక్షణ కవచంలా, ప్రాణాలకు తెగించి కొట్లాడే సైనిక బలగాల కూర్పులోనూ అగ్నిపథ్ పేరుతో ఔట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్కు తెర లేపడం ఎంతగా అగ్గి రాజేసిందో అందరికీ తెలిసింది.
ధరల పెరుగుదలను అదుపు చేయలేక చతికిల బడిన మోదీతో జనమంతా విసుగెత్తి చివరి అస్త్రంగా బైబై మోదీని ఎత్తుకున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా తమ ఆయుధాలను బలంగా సంధిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ దేశాన్ని రక్షించే పనిలో భాగస్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్రలో సాఫీగా జరుగుతున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి విలువలకు పాతరేస్తున్న వైనంపైనా జనం నిప్పులు చెరుగుతున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక తరహాలో దొడ్డి దారిలో సర్కారులోకి వచ్చేందుకు చేస్తున్న బీజేపీ కుటిల నీతిని జనమంతా చీ కొడుతున్నారు
కేసీఆరే ప్రత్యా మ్నాయం..
దేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న నాయకుడు నేతృత్వం వహించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. మతం పేరిట యాగి చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోని బీజేపీ ద్వంద నీతిని ప్రజలు గ్రహించారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను ప్రాధాన్యతగా పెట్టుకొని సేవ చేసే వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలని జనమంతా కోరుకుంటున్నారు. భారతదేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్నను రోడ్డు పాలు చేసే కుట్రలకు దిగిన మోదీకి సరైన రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే సమాధానమంటూ ప్రజలు భావిస్తున్నారు.
రైతులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అనేక సదుపాయాలను, సౌకర్యాలను కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే కేంద్ర సర్కారు నిలవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఒక్కరేనంటూ జనం నినదిస్తున్నారు. ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణను ప్రగతి పథాన నిలబెట్టిన కేసీఆర్ ద్వారానే దేశానికి పట్టిన పీడ విరగడ అవుతుందని రాజకీయ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.
ప్రజల ఆకాంక్షకు నిదర్శనంగా బైబై మోదీ..
బైబై మోదీ అనేది ఇప్పుడు నినాదంగా మారింది. అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందేమీ లేదు. ప్రజలకు జరిగిన మేలు కన్నా కార్పొరేట్ కంపెనీలకు భారీగా మేలు జరిగింది. ఈ విషయాన్ని ఆలస్యంగానైనా యావత్ దేశ ప్రజలు గుర్తించి బైబై మోదీ అంటున్నారు. అగ్నిపథ్తో యువత కోపాగ్నికి మోదీ గురయ్యారు. బైబై మోదీ ఉద్యమం దేశ వ్యాప్తంగా పాకింది. మోదీని ఇంటికి పంపించే రోజులే కనిపిస్తున్నాయి.
– పుప్పాల రవి, తెలంగాణ ఉద్యమకారుడు
మోదీకి పాలించే అర్హత లేదు..
దేశాన్ని పరిపాలించే కనీస అర్హత నరేంద్ర మోదీకి లేదు. మతం పేరుతో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకొనే నాయకుడ్ని ఇప్పటి వరకూ చూడలేదు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశం అట్టడుగుస్థాయికి దిగజారుతున్నది. ఇది మంచి పరిణామం కాదు. మోదీ దిగిపో అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. కేంద్రంలో బీజేపీ గద్దె దిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది.
– సుజిత్ సింగ్ ఠాకూర్, తెలంగాణ ఉద్యమకారుడు