నిజామాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నందిపేట:శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవ ఘట్టంలో రెండో రోజు ఆదివారం వైదిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రుత్వికులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతులతోపాటు దేవనపల్లి రామ్కిషన్ రావు -నవలత, దేవనపల్లి అరుణ్ – ననిత ఆయా క్రతువుల్లో పాల్గొని భక్తిప్రపత్తులతో దేవుళ్లను కొలిచారు. ఉదయం ప్రాతఃఆరాధన, సేవాకాలం, ద్వార తోరణం, ధ్వజ కుంభ ఆరాధన వంటి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం చతుఃస్థానార్చన, అరని మథనం, యాగశాల ప్రవేశం నిర్వహించారు. యాగశాలలో సహజ సిద్ధంగా నిర్వహించిన అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నది. చెక్కతో తయారు చేసిన చరకతో అగ్ని దేవున్ని ఆహ్వానిస్తూ చేసిన క్రతువులో భక్తి పారవశ్యం అడుగడుగునా కనిపించింది. అగ్ని జ్వలించిన సందర్భంగా భక్తులంతా చేతులు జోడించి గోవింద నామస్మరణ చేశారు. అనంతరం మూల మంత్రమూర్తి, మంత్ర హవనము, ఛాయాధివాసము, వాస్తు శాంతి, వాస్తు పర్యగ్నీకరణం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనము నిర్వహించారు. నిత్య పూర్ణాహుతి, మంగళశాసనము, శాత్తుమోరై, వేద విన్నపాలు వైభవంగా నిర్వహించారు.
ప్రతిష్ఠా విగ్రహాలకు జలాధివాసం..
ఆదివారం సాయంత్రం వైదిక క్రతువులో ముఖ్యమైన ఘట్టాలను నిర్వహించారు. 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర, మూ ర్తిమంత్ర హవనములు సందడిగా జరిగాయి. సమీపం లోని గోదావరి నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంప తులు జలాలను తీసుకొచ్చారు. వారి వెంట ఎమ్మెల్యే జీవన్రెడ్డి దంపతులు, నాయకులు ఉన్నారు. అనంతరం నూతన ఆలయంలో ప్రతిష్ఠించనున్న శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలకు జలాధివాసము నిర్వహించారు. పంచసూక్త పరివార ప్రాయశ్చిత హవన ము, నిత్య పూర్ణాహుతి తర్వాత మంగళ శాసనం, వేద విన్నపాలు, తీర్థ ప్రసాద గోష్టితో రాత్రి 9.30గంటలకు రెం డో రోజు కార్యక్రమాలు ముగిశాయి. పూజా కార్యక్రమాల్లో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి కమలాకర్రావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
హాజరైన మంత్రి వేముల, ఎమ్మెల్యేలు..
శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ ప్రారంభోత్సవ రెండోరోజు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్లు హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తు ల్లో పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు ముఖ్యమైన వేదిక క్రతువుల్లో భాగస్వామ్యమయ్యారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు 2గంటల పాటు మంత్రి వేముల, ఎమ్మెల్యేలు గడిపారు.
ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభ.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
గోదావరి నది సమీపంలో ఉన్న ఈ ప్రాంతానికి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేవునపల్లి పూర్వీకులు నమ్మి కొలిచే దైవమైన లక్ష్మీనర్సింహస్వామికి ఆలయం నిర్మించాలన్న సంకల్పం రావడం ఎంతో గొప్పదని, ఆ సంకల్పంతో ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రసిద్ధ దేవస్థానంగా విరాజిల్లుతుందని అన్నారు. ఇంత చక్కని ఆలయాన్ని నిర్మించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబీకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంత్రి వివరించారు.
ఒకే రంగు చీరలతో మహిళ వలంటీర్లు..
వేలాదిమంది భక్తులకు సేవలందించడానికి చౌడమ్మ కొండూర్ గ్రామ మహిళలు వలంటీర్లుగా సేవలందిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా పసుపు రంగు చీరలను ధరించడంతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించింది.
వేడిని తగ్గించడానికి స్ప్రింక్లర్లు..
ఆలయం చుట్టూ రద్దీగా ఉన్న భక్తజనానికి ఎండ వేడిమిని తగ్గించేందుకు స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. స్ప్రింకర్ల నుంచి నీటి తుంపర్లు రావడంతో చల్లదనాన్నిస్తూ ఎండవేడిమిని తగ్గిస్తున్నాయి. భక్తజనం కూర్చోవడానికి ఏర్పాటు చేసిన కుర్చీల వద్ద, ఆలయం చుట్టూ, భోజనశాల వద్ద ఈ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు.