శక్కర్నగర్, మే 22: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, మాస్కాపీయింగ్కు తావులేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ సూచించారు. బోధన్లోని పలు ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను ఆయన మండల విద్యాధికారి శాంతకుమారితో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఎంఈవో కార్యాలయంలో మాట్లాడారు. పట్టణంలోని ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని, ఇతర వ్యక్తులు లోనికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లపై ఆయన సంతృప్తిని వ్యక్తంచేశారు. బోధన్ అర్బన్, రూరల్లో మొత్తం 13 పరీక్షా కేంద్రాల్లో 2,900 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని ఎంఈవో శాంతకుమారి తెలిపారు. మొత్తం 180 మంది ఇన్విజిలెటర్లు విధులు నిర్వహిస్తున్నారన్నారు.
పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
బాల్కొండ/రెంజల్/నవీపేట/మోర్తాడ్/మాక్లూర్, మే 22 : నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయా మండలాల విద్యాధికారులు ఆదివారం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
బాల్కొండ మండలంలో మొత్తం 1,144 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈవో బట్టు రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు.
రెంజల్ మండలంలో మొత్తం 420 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాస్తారని, ఇందుకోసం రెంజల్ ఆదర్శ పాఠశాల, నీలా హైస్కూల్లో సెంటర్లను ఏర్పాటు చేశామని ఎంఈవో గణేశ్రావు తెలిపారు.
నవీపేట మండలంలో మొత్తం 665 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకోసం నాలుగు సెంటర్లను ఏర్పాటు చేశామని ఎంఈవో గణేశ్రావు తెలిపారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.
మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్ బాలికల ఉన్నత పాఠశాల, కృష్ణవేణి హైస్కూల్, పాలెం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 322 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని ఎంఈవో ఆంధ్రయ్య తెలిపారు.
మాక్లూర్ మండలంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 610 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని ఎంఈవో రాజగంగారెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.