నిజామాబాద్ క్రైం, మే 20: నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వరకు హల్చల్ చేస్తున్న యువతను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. రోడ్ల పై ఇష్టానుసారంగా తిరగడం, మద్యం సేవిం చి వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారి భరతం పట్టేందుకు పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు ‘ఆపరేషన్ చబుత్రా’ పేరుతో తనిఖీలను ముమ్మ రం చేశారు. పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనవసరంగా రోడ్లపై అడ్డాలు, బైఠాయించడం, వాహనాలపై చక్కర్లు కొట్టడం, గ్యాం గులుగా ఏర్పడి కాలనీలు, హోటళ్లలో కూర్చునే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. సీపీ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి నగరంలోని 1,2,3,4,5,6 పోలీస్స్టేషన్లతోపాటు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధిత స్టేషన్ల ఆఫీసర్స్, సిబ్బంది కలిసి ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించారు.
రోడ్లు, హోటళ్లు, కాలనీల్లో అనవసరంగా తిరుగుతున్న 350 మంది యువకులను పట్టుకొని వారిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్కు తరలించారు. అక్కడ ప్రతి ఒక్కరి పేరు, వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం అదనపు డీసీపీ వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దన్నారు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్లపై తిరుగకూడదని సూచించారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరగడంవల్ల వారి విలువైన సమయం ఎంతగా వృథా అవుతుందో వివరించారు. యు వత చెడు మార్గంలో వెళ్లకుండా వారి తల్లిదండ్రు లు బాధ్యత వహించాలని ఆయన సూచించారు. మొదటిసారి కావడంతో కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెడుతున్నామని, రెండోసారి పట్టుబడితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.