నిజామాబాద్ క్రైం, మే 19: చోరీ చేసిన సెల్ఫోన్ కొనుగోలు విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. పథకం ప్రకారం యువకుడిపై యాసిడ్ దాడి చేసిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నగరంలోని బాబన్సహాబ్ పహాడ్ ప్రాంతానికి చెందిన షేక్ సలీం, కొమురయ్య కాలనీకి చెందిన రంజానీ, ఫారుఖ్, మతీన్ స్నేహితులు. కూలిపని చేసుకునే సలీం.. స్నేహితుల వద్ద ఓ సెల్ఫోన్ను రూ.4,500కు కొన్నాడు. వినియోగిస్తున్న సమయంలో అది దొంగిలించిన మొబైల్ ఫోన్గా తెలియడంతో స్నేహితులకు తిరిగి ఇచ్చేశాడు. తాను చెల్లించిన డబ్బుల్లో రూ.3,500 తీసుకున్నాడు.
మిగితా వెయ్యి రూపాయలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో ఆగ్రహం చెందిన స్నేహితులు.. కలీంపై దాడి చేసేందుకు పథకం పన్నారు. పార్టీ చేసుకున్న అనంతరం డబ్బులు ఇస్తామంటూ కలీంను సారంగాపూర్ శివారులోని డెయిరీఫారం ప్రాంతానికి బుధవారం తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం వెంట తెచ్చుకున్న బ్యాటరీ యాసిడ్తో కలీంపై దాడిచేసి పరారయ్యారు. ఈ ఘటనలో కలీం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు ఆరోటౌన్ ఇన్చార్జి ఎస్సై జ్ఞాన్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. సీఐ నరేశ్ పర్యవేక్షణలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.