ఖలీల్వాడి, మే 19 : హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మున్సిపల్, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్ హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ జిల్లాలో హరితహారం అమలును ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు. జాతీయ రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు, వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్.. జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారన్నారు.
ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ హరితహారం విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రధానంగా కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువల వద్ద పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు వీలుగా ఖాళీ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా కబ్జాలు ఉంటే నివేదికలో వాటి వివరాలను కూడా పొందుపర్చాలని సూచించారు. వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ఎక్కడ కూడా చిన్నపాటి లోపం కనిపించకూడదని, పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల కోసం అర ఎకరం చొప్పున స్థలాలను గుర్తించాలని సూచించారు.
వసతి గృహాల్లో సదుపాయాలు మెరుగుపర్చాలి
సంక్షేమ వసతిగృహాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి కనీసం వారం రోజుల ముందే నిర్మాణ, మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లల సంక్షేమాన్ని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సేవా దృక్పథంతో పని చేయాలని హితవు పలికారు.
నూటికి నూరు శాతం నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని, నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో చందర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాభివృద్ధి శాఖల అధికారులు శశికళ, నాగోరావు, నర్సయ్య, పంచాయతీరాజ్ ఈఈ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.