ఇందల్వాయి/ఖలీల్వాడి (మోపాల్)/డిచ్పల్లి/నిజామాబాద్ రూరల్, మే 16: ఇందల్వాయి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సిర్నాపల్లి, నల్లవెల్లి, గన్నారం, ఇందల్వాయి, అన్సాన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎంపీపీ రమేశ్ నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి పరిశీలించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మోపాల్ మండలంలోని కంజర, అమ్రాబాద్, భైరపూర్, బాడ్సి, మంచిప్ప, ముదక్పల్లిలో ధాన్యం తడిసిందని తహసీల్దార్ వీర్సింగ్ తెలిపారు. మంచిప్ప గ్రామంలో ఇండ్లు కూలగా, విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయని పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. మండలంలోని సుద్దులం, కొరట్పల్లి, రాంపూర్, మిట్టపల్లి, ఘన్పూర్ గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
కొనుగోలు కేంద్రాల పరిశీలన..
నిజామాబాద్ రూరల్ మండలంలోని ముత్తకుంట, మాధవ్నగర్, గుండారం సొసైటీల పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ప్రశాంత్కుమార్ పరిశీలించి తడిసిన ధాన్యంపై ఆరా తీశారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించడానికి లారీలను పంపించాలని ముత్తకుంట సొసైటీ సెక్రటరీ నంబూద్రిపాగ్ విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ వెంట సొసైటీ చైర్మన్లు స్వామి, శ్రీధర్, నాగేశ్వర్రావు తదితరులు ఉన్నారు.