భీమ్గల్/ఖలీల్వాడి, మే 16 : రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై దళిత ఐక్య సంఘటన నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భీమ్గల్ పట్టణంలో ఆయన దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపీ అయిన అర్వింద్.. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేందంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే పదవులను అనుభవిస్తున్నట్లు గుర్తుచేశారు. అర్వింద్పై ప్రధాని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన గౌరవ అధ్యక్షుడు పర్స నవీన్, గంగాధర్, జేజే నర్సయ్య, ప్రెసిడెంట్ మేకల శ్రీనివాస్, కార్యదర్శి గంట భాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
రాజ్యాంగాన్ని మారుస్తామంటూ మాట్లాడిన ఎంపీ అర్వింద్.. తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. రాజ్యాంగ పునాదులను దెబ్బ తీయడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో మైనార్టీలకు రిజర్వేషన్లను ఎత్తివేస్తామని వ్యాఖ్యానించారని అన్నారు. ఇదంతా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తామన్న నాయకులే దానికి తూట్లు పొడవాలని అనుకోవడం నియంతృత్వానికి దారి తీస్తుందన్నారు. జిల్లా ప్రజలు, యువకులు అర్వింద్ వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా నాయకులు వై.గంగాధర్ పాల్గొన్నారు.
ఎంపీ వ్యాఖ్యలు సిగ్గుచేటు..
జిల్లా కేంద్రంలో మాలమహానాడు నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రపంచం ఆసక్తి చూపుతుంటే దేశంలో మాత్రం రాజ్యాంగాన్ని మార్చాలని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఇది ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రిజర్వేషన్ పొందుతున్న బీసీ కులంలో పుట్టి పార్లమెంట్ సభ్యుడై ఉండి రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నాయకులు ఎల్లయ్య, వినయ్కుమార్, సంజీవ్, కిష్టయ్య, వెంకటరమణ, ప్రసాద్, ప్రభాకర్, గంగాధర్, దేవయ్య, నారాయణ, రాంచందర్, బాలయ్య, రాజేశం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.