నిజామాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో రైతు ప్రయోజనాలను కాపాడడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీలేకుండా పని చేస్తున్నారు. ఎంతటి భారమైనా సరే భరించి కర్షకుల కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట ఉత్పత్తులు సాధించిన రైతన్నల బాధలు తీర్చేందుకు యాసంగి 2022లో ధాన్యం సేకరణకు సీఎం ముందడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా కొర్రీలు పెడుతున్నప్పటికీ నష్టాలు లెక్కచేయకుండా రైతు ప్రయోజనమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. మర ఆడించిన బియ్యం సేకరణలో భారత ఆహార సంస్థ తర చూ కిరికిరి పెడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తోంది. రైస్మిల్లుల్లో తనిఖీల పేరుతో కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నది. ఇన్ని అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొంటూ రైతు కోసం సామరస్య వాతావరణంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు యాసంగిలో వరి సాగు చేసిన 72 వేల మంది రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వానికి విక్రయించారు. రెండు జిల్లాలో ఇప్ప టి వరకు రూ.1016 కోట్ల లువ చేసే 5లక్షల 19వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ యంత్రాంగం సేకరించింది. అనేక అవరోధాలు ఎదురైనా అప్పటికప్పుడు సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తూ ధాన్యం సేకరిస్తుండడం విశేషం.
ధాన్యం గణాంకాలివీ…
నిజామాబాద్ జిల్లాలో యాసంగి ధాన్యాన్ని సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ మొత్తం 472 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు 457 కేంద్రాలను తెరిచింది. ఇందులో ఇప్పటికే 10 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తవ్వగా మూసేసింది. ఆయా కేంద్రాల ద్వారా నిజామాబాద్ జిల్లాలో 55,146 మంది రైతుల నుంచి 4లక్షల 16వేల 846 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సేకరించింది. ఈ ధాన్యం విలువ రూ.817.01 కోట్లుగా ఉంది. గన్నీ సంచుల కొరత ఉన్నప్పటికీ సమన్వ యం చేసుకుంటూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో 342 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా 340 కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో లక్షా 2వేల 419 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 16,581 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. సర్కారు సేకరించిన ధాన్యం విలువ రూ.199.45 కోట్లుగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 797 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.1016.45 కోట్లు విలువ చేసే 5.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 71,727 మంది రైతుల నుంచి సేకరించడం విశేషం.
నిరంతర అప్రమత్తత…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ముగింపునకు చేరుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 800 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పా టు చేశారు. వీటిలో 10 శాతం కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తవ్వడంతో మూసేశారు. మిగిలిన చోట్ల చకచకా ధాన్యం రాకను అనుసరించి రైతుల ముంగిటనే కేంద్రాలు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. దూర ప్రాంతానికి ధాన్యాన్ని మోసుకు పోవడానికి రైతులకు రవాణా ఖర్చు లేకుండా సమీపంలోనే కేంద్రాలు తెరవడంతో ఉపశమనం దక్కుతోంది. మద్దతు ధర కల్పించడమే ముఖ్య ఉద్ధేశంతో ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. తేమ శాతం నిర్దేశిత ప్రమాణాల్లో ఉండాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తాత్కాలిక కల్లాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. కాకపోతే కొద్ది రోజులుగా చెడగొట్టు వానలు కాస్త రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి – ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అప్రమత్తం చేస్తూ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన పిమ్మట వెనువెంటనే డిజిటల్ విధానంలో వివరాలు చకచకా నమోదు చేసి నిర్ణీత కాల వ్యవధిలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గందరగోళంలో ఎంపీ అర్వింద్…
రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నది. ఈ ప్రక్రియలో అడుగడుగునా కుట్రపూరితంగా ఆటంకాలు కల్పించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే ఎఫ్సీఐ అధికారులు తనిఖీల పేరుతో కాలయాపన చేస్తూ రైస్మిల్లర్లు సమయాన్ని వృథా చేస్తున్నారు.
అంతేకాకుండా బెదిరింపు ధోరణికి పాల్పడుతూ పలువురిని బ్లాక్ మెయిలింగ్కు సైతం కేంద్రం ఆధీనంలోని ఎఫ్సీఐ బృందాలు దుస్సాహాసానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. రైతుల ధాన్యాన్ని సేకరించకుండా అడ్డుపుల్లలు పెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగ్విజయంగా ధాన్యాన్ని సేకరించడంపై నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ జీర్ణించుకోలేకపోతున్నాడు. కండ్ల ముందే లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వందలాది కేంద్రాల ద్వారా సేకరిస్తుండగా నిజామాబాద్లో కేంద్రాలే తెరవలేదంటూ, ధాన్యం సేకరణ మెల్లిగా జరుగుతుందంటూ ఆరోపణలకు దిగుతుండడంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. మే 12న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి ఎంపీ ఓ లేఖను రాశారు. ధాన్యం సేకరణ జరగడం లేదని ఎంపీ పేర్కొన్నారు. వాస్తవానికి నిజామాబాద్లో 4.16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55 వేల మంది రైతుల నుంచి సేకరించారు. వీటి విలువ రూ.817కోట్లు ఉండగా బీజేపీ ఎంపీ ఇందుకు విరుద్ధంగా తప్పుడు ప్రచారానికి తెర లేపడంపై రైతులు మండిపడుతున్నారు.