బోధన్, మే 15: కొవిడ్ సెకండ్ వేవ్లో కరోనా బారిపడి.. బ్లాక్ ఫంగస్తో పై నోటి భాగాలను, పై దవడ ఎముకను పూర్తిగా కోల్పోయిన ఒక వ్యక్తికి బోధన్లో అరుదైన శస్త్రచికిత్స, దంతాల అమరిక నిర్వహించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో అక్కడక్కడ అరుదుగా జరుగుతున్న ఇలాంటి శస్త్రచికిత్స బోధన్లోని ఖుషీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఇన్ప్లాంట్ అండ్ ట్రామా సెంటర్లో విజయవంతంగా నిర్వహించడం విశేషం. దంత వైద్య చికిత్సలో ఇది ఒక గొప్ప విషయమని వైద్యులు అంటున్నారు. వైద్య పరిభాషలో ఈ ప్రక్రియను ‘ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఇన్ పోస్ట్ కొవిడ్ మ్యూకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)’ అని పిలుస్తున్నారు.శస్త్రచికిత్స, దంతాల అమరిక వివరాలను వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఖుషీ దంత వైద్యశాల వైద్యుడు శ్రీకాంత్ దేశాయ్, చికిత్స పొందిన పేషెంట్ అమిత్ బిరిధర్తో కలిసి ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు.
మహారాష్ట్రలోని లాతూర్లో ఒక సీడ్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న 42ఏండ్ల అమిత్ బిరిధర్ సెకండ్ వేవ్లో కరోనా బారినపడ్డాడు. 21 రోజులపాటు ఆక్సిజన్ సహాయంతో చికిత్సపొందాడు. మహారాష్ట్రలో అప్పట్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉండడంతో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ను ఇచ్చారు. కొవిడ్ నుంచి కోలుకున్న అతడు బ్లాక్ ఫంగస్ బారినపడ్డాడు. నోటిలోని సైనస్తో పాటు పైదవడలోని భాగాలను, రెండు, మూడు పళ్లు తప్ప పై దవడ ఎముక (అప్పర్ జా)ను పూర్తిగా తొలగించారు. సరిగ్గా మాట్లాడడం, ఆహారం తినలేని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలోని సుమారు 70 దవాఖానలకు తిరిగినా శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదని పేషెంట్ బిరిధర్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో తనకు తెలిసినవారి నుంచి బోధన్లోని ఖుషీ దంత వైద్యశాల గురించి తెలుసుకున్నానని, చికిత్స కోసం వచ్చానని చెప్పారు.డాక్టర్ శ్రీకాంత్ దేశాయ్ అన్ని రకాల పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స పూర్తిచేశారు.