ఇందూరు, జూలై 6 : జలాశయాల ద్వారా రైతుల అవసరాల మేరకు ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని ప్రగతి భవన్లో నీటిపారుదల సలహా బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి మంత్రితోపాటు, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న విఠల్రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్షిండే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో ఈ రోజు కాళేశ్వరం జలాలు మంజీరా నదిలోకి వచ్చాయని.. ఇదొక అద్భుతమని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్సారెస్పీలో 29.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రైతుల అవసరాలను బట్టి కాకతీయ కెనాల్ ద్వారా నీటిని వదిలేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. లక్ష్మి కెనాల్ ద్వారా ఈ నెల 11 నుంచి నీటిని వదిలేందుకు బోర్డు అనుమతించిందన్నారు. ఈ కాలువ ద్వారా చెరువులు సైతం నింపుతామన్నారు.
అలీసాగర్ లిఫ్ట్ ద్వారా జూలై 11 నుంచి నవంబర్ వరకు 6 విడుతలుగా 6.77 టీఎంసీలు, గుత్ప నుంచి ఆర్మూర్ నియోజకవర్గ రైతుల కోసం6 విడుతలుగా నీటిని విడుదల చేసేందుకు బోర్డు నిర్ణయించిందన్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి ఆగస్టులో నీటిని విడుదల చేస్తామని, కౌలాస్నాలా ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉందని, జూలై నుంచి సెప్టెంబర్ వరకు రైతాంగానికి అవసరమయ్యే నీటిని విడుదల చేస్తామన్నారు.