నిజామాబాద్, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ను రైతు లు నిద్దుర పోనివ్వడం లేదు. అసత్య హామీలు, అసంబద్ధ ప్రకటనలతో 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు తరచూ నిరసనల సెగ తగిలిస్తున్నారు. తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని మాట తప్పిన అర్వింద్ తీరును రైతులు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. ఇచ్చిన హామీ ఏమైందని మూ డేండ్లుగా ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పసుపు రైతులు నిరంతర ఉద్యమాలతో బీజేపీ తీరును ఎండగడుతున్నారు. రైతుల కోపాగ్నికి జంకుతోన్న ఎంపీ.. కొం త కాలంగా ఇటువైపు పర్యటనలకే రావ డం లేదు. ఒకవేళ వచ్చినా. ఎక్కడికక్కడ నిరసనల స్వాగతం కనిపిస్తోంది. పసుపుబోర్డు ఏమైందంటూ ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. సీన్ కట్ చేస్తే.. తాజాగా వడ్ల కొనుగోలు అంశంలో ఆర్మూర్ రైతులు తిరగబడ్డారు. ఎంపీ అర్వింద్, కమలం పార్టీ నేతల మాటలు విని వరి వేసిన రైతులంతా తమ వడ్లను కేంద్రమే కొనాలంటూ నిరసనకు దిగారు. ఏకంగా ఆర్మూర్ పెర్కిట్లోని ఎంపీ నివా సం ఎదుట వడ్ల ను పారబోసి ఆందోళన చేశారు. వరి వేయాలని రైతులను రెచ్చగొట్టి ఇప్పుడు ముఖం చాటేస్తోన్న బీజేపీ నాయకుల తీరును కర్షకులు ఎండగట్టడంతో ఆ పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యాయి.
రెచ్చగొట్టినందుకు దక్కిన ప్రతిఫలం…
యాసంగి సాగు సీజన్ ప్రారంభంలో వరి వేయొద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. ప్రభుత్వాధికారులు సైతం ఇతర పంటలు వేసుకోవాలని చెప్పారు. ఈ సమయంలో బీజేపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా రైతులను రెచ్చగొట్టి వరి పంట వేయించారు. రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే వడ్లు కొంటుందని చెప్పి రైతులను వరి వైపు మళ్లించారు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సరికి కేంద్రం వడ్ల పంచాయితీ పెట్టడంతో బీజేపీ నాయకులు రైతులకు ముఖం చాటేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తాము పండించిన వడ్లను తక్షణమే సేకరించాలని కోరుతూ మంగళవారం ఉదయం పెర్కిట్లో గల ఎంపీ అర్వింద్ ఇంటి వద్దకు ట్రాక్టర్లో వడ్లను తీసుకొచ్చి గుమ్మరించారు. కేంద్ర ప్రభు త్వం, ఎంపీ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపా రు. కేంద్రమే వడ్లను కొనాలని, ఇందుకోసం ఎంపీ అర్వింద్, బీజేపీ నేతలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్ల జెండాలను చేతపట్టి మోదీ డౌన్ డౌన్… అర్వింద్ డౌన్ డౌన్ అంటూ శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. తాజా పరిణామంతో బీజేపీ నేతలు కంగుతిన్నారు.
ఇంటా, బయటా నిరసనలే…
పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్కు ఇంటా, బయటా నిరసన సెగలు తగులుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన అర్వింద్ను పాతతరం కమలం పార్టీ నేతలు దగ్గరకే రానివ్వడం లేదు. అహంకార పూరిత మాటలు, నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని అడుగడుగునా తప్పు పడుతున్నారు. పసుపుబోర్డు హామీ విషయంలో పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారన్న అపవాదుతో ఎంపీపై కమల దళం గుర్రుమంటోంది. ఇదిలా ఉండగా గత శనివారం ఎంపీ నివాసంలో జరిగిన బీజేపీ సమన్వయ సమావేశంలోనూ అంతర్గత విభేదాలు బయటపడ్డా యి. ఎంపీ తీరుపై చాలా రోజులుగా గుర్రుగా ఉన్న నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఓ ద్వితీ య శ్రేణి నాయకుడి చేతిలో ఎంపీ అర్వింద్ పరు వు పోగొట్టుకున్నాడంటూ బీజేపీ శ్రేణులు కోడై కూ స్తున్నాయి. మరోవైపు, మంగళవారం పెర్కిట్లోని అర్వింద్ ఇంటి ఎదుట రైతులు ధర్నాకు దిగడం కాషాయ దళంలో కలవరం రేపింది. ఇలా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఓ వైపు రైతులు, మరోవైపు సొంత పార్టీ నేతలు, సామాన్య ప్రజలంతా అర్వింద్ తీరును బాహటంగానే తప్పు పడుతున్నారు.
అర్వింద్ వంకర మాటలు..
అబద్ధపు హామీలు,మోసపూరిత వాగ్దానాలతో రైతులను మభ్యపెట్టాలని చూస్తే ఎప్పటికైనా రైతుల నుంచి ఎదురుదెబ్బ తగులుతుందని ఎంపీ అర్విం ద్ విషయంలో రుజువైంది. ఆర్మూర్లో బీజేపీ ఎం పీ నివాసం ఎదుట జరిగిన రైతుల ఆగ్రహావేశాలపై స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి స్పందించారు. ఫొటోలను కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అర్వింద్కు ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ, వరి రై తుల ఆగ్రహాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎం పీ ఇంటి ఎదుట రైతులు వడ్లను పారబోస్త్తున్న దృ శ్యాల ఫొటోలను ట్విట్టర్లో ఇరువురికి ట్యాగ్ చే యగా, సోషల్ మీడియాలో చాలా మంది రైతులు, రైతు బిడ్డలంతా రీ ట్వీట్లతో బీజేపీపై మం డిపడుతున్నారు. ఫేక్ బీజేపీ, వన్ నేషన్ – వన్ ప్రొ క్యూర్మెంట్ హ్యాష్ట్యాగ్తో పోస్టులు పెడుతున్నారు.
ఎంపీ అర్వింద్ రైతుల పక్షాన పోరాటం చేయాలి
ఆర్మూర్, ఏప్రిల్ 12 :ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న అర్వింద్ ఇంతవరకు దాని ఊసే ఎత్తడంలేదు. రైతు సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇకనైనా అర్వింద్ తీరుమార్చుకొని పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమాల్లో పాల్గొనాలి. తీరు మార్చుకోకపోతే అర్వింద్కు రైతుల చేతుల్లో భంగపాటు తప్పదు.
-టి.సి.సాయన్న, సర్పంచ్ చేపూర్, ఆర్మూర్
కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడాలి. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో రైతుల చేతుల్లో బీజేపీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.
-రిక్కల రాజారెడ్డి, సొసైటీ డైరెక్టర్ చేపూర్ , ఆర్మూర్
వడ్లు కొనే వరకూ నిరసనలు
యాసంగిలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనే వరకు బీజేపీ నాయకుల ఇండ్ల వద్ద నిరసనలు చేస్తూనే ఉంటాం. సీఎం కేసీఆర్ రైతాంగం కోసం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతూ అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నది.
-ఎస్కె.నర్సయ్య, రైతు చేపూర్