రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవలే జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. ఇంజినీరింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక, భిక్కనూర్ సౌత్క్యాంపస్లో ఇంజినీరింగ్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
కామారెడ్డి, ఆగస్టు 18 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో వైద్య విద్యతోపాటు ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నది. దీంతో జిల్లా రానున్నరోజుల్లో ఎడ్యుకేషన్ హబ్గా మారనున్నది. ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరుచేసి, జిల్లా వాసుల ఎన్నో ఏండ్ల కలను నెరవేర్చింది. జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ 2018లో జరిగిన గంప గోవర్ధన్ ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చా రు.
2021 జూన్ 20న సమీకృత కలెక్టరేట్ నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చిన సీ ఎం కేసీఆర్కు వైద్యకళాశాల ఏర్పాటుపై ప్రభుత్వ విప్ మరోసారి విజ్ఞప్తి చేశారు. దీంతో వైద్య కళాశాల మంజూరుచేస్తానని ఇచ్చిన హా మీ మేరకు జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరుచేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాలను ఏర్పాటు చేయనుండడంతోపాటు కామారెడ్డి ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీటితో పాటు రూ.235 కోట్లు విడుదల చేస్తూ జీవో విడుదల చేశారు.
కామారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ డిగ్రీ కళాశాల, డెయిరీ టెక్నాలజీ కళాశాలకు చెందిన 20 ఎకరాల స్థలాన్ని సేకరించారు. డిగ్రీ కళాశాలకు చెం దిన భూమిలోనే ఇప్పటికే మాతా శిశు సంరక్షణ కేంద్ర భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దాని పక్కనే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. కళాశాలకు 100 సీట్ల ను కేటాయించనున్నట్లు ఉత్వర్వు లో పేర్కొన్నారు.మెడికల్ కళాశాలకు జిల్లా కేంద్ర దవాఖానను అటాచ్డ్ చేస్తూ ప్రభుత్వం వైద్యశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కళాశాల భవనాల నిర్మాణ విషయంలో డ్రాఫ్ట్ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఎక్కడెక్కడ అనువుగా వసతులు, భూములు, అనుబంధ దవాఖానలు ఉన్నా యో ఇప్పటికే వైద్యారోగ్యశాఖ గుర్తించింది.
తెలంగాణ యూనివర్సిటీకి అనుబంధంగా భిక్కనూర్ మండలంలో ఉన్న సౌత్ క్యాంపస్ పరిధిలో ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరో రెండు పీజీ కోర్సులను ప్రారంభించనున్నారు. ఇందుకు వర్సిటీ పాలకమండలి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌత్ కా్ంయపస్కు 56 ఎకరాల స్థలం ఉంది. సౌత్ కా్ంయపస్లో ప్రస్తు తం ఏడు కోర్సులు (ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమి స్ట్రీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ), ఎం.ఏ తెలుగు, ఎం.ఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్) కొనసాగుతున్నాయి. ప్రతి కోర్సులో 30 సీట్లు ఉండగా, ఇందులో కొన్ని కోర్సుల్లో సీట్లను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సౌత్ క్యాంపస్లో ఇంజినీరింగ్ కళాశాలతో పాటు మరో రెండు పీజీ కోర్సులు (ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ జియాలజీ) రానున్నాయి. వీటిని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించనున్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం బాన్సువాడకు నర్సింగ్ కళాశాలను మంజూరుచేసింది. ఈ కళాశాలను గత విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. వంద మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారు. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 40కోట్ల నిధులు విడుదల కాగా, పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మొదటిసారి బాన్సువాడలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాలను ప్రభుత్వం మంజూరుచేసింది. 12 అదనపు తరగతి గదుల నిర్మా ణం కోసం రూ.3.50 కోట్లు, వీటితో పాటు 15 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. ఈ వి ద్యా సంవత్సరం నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు సంబంధించి దోస్త్ కింద 240 మంది విద్యార్థుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.
రాష్ట్రంలోనే ఏకైక కళాశాల పీవీ నర్సింహరావు పశు వైద్య డెయిరీ టెక్నాలజీ కళాశాల కామారెడ్డిలో ఉంది. నాలుగేండ్ల కోర్సులో ప్రతి ఏడాది ఎంసెట్ ద్వారా 35మంది విద్యార్థులు భర్తీ అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి, కామారెడ్డిలో మాత్రమే బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సు ఉండగా, రాష్ట్ర విభజన అనంతరం కామారెడ్డి కళాశాల వెటర్నరీ కళాశాలకు అనుబంధంగా మారింది. దేశ, విదేశాల్లో డెయి రీ టెక్నాలజీ కోర్సుకు డిమాండ్ ఉంది. నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో ప్రభు త్వ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్లారెడ్డిలో ఐటీఐ కళాశాల కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ విషయమై ఇప్పటికే ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కామారెడ్డిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయం కొన్నేండ్లుగా ప్రతిపాదనలో ఉంది.
కామారెడ్డి జిల్లాలో విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నది. కొత్త కోర్సులతో మరిన్ని అవకాశాలు మెరుగుపడుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు కానున్నది. ఇందు కోసం ప్రభుత్వం రూ.235 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమమతులు కూడా ఇచ్చింది. సౌత్క్యాంపస్ పరిధిలో ఇంజినీరింగ్ కళాశాలతో పాటు రెండు కొత్త కోర్సులు రానున్నాయి. సౌత్ క్యాంపస్ అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి చేస్తాను. కామారెడ్డి జిల్లా త్వరలో ఎడ్యుకేషన్ హబ్గా మారనున్నది.
-గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కామారెడ్డి లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుం డడంతో జిల్లా వైద్యపరంగా మరింత అభివృద్ధి చెందే అవ కాశాలు ఉన్నాయి. బాన్సువాడలో నర్సింగ్ కళాశాల స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో ఏర్పాటైంది. బాన్సువాడలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల ఏర్పాటు కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి.
-పోచారం భాస్కర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్
జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నందుకు ప్రజలు రుణపడి ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నది. జిల్లాలో విద్యాలయాలు, విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు అనుకూలంగా ఉన్నాయి. కామారెడ్డిలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసే విషయా న్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం.
– ఎంకే ముజీబుద్దీన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్