డిచ్పల్లి, డిసెంబర్ 4 : యూనివర్సిటీకి జాతీయ మదిం పు, అంచనా మండలి (న్యాక్) గుర్తింపు ఉంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రైవేటు విద్యా సంస్థలు న్యాక్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే తెలంగాణ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు మాత్రం న్యాక్పై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. 2016 ఫిబ్రవరిలో అప్పటి ఇన్చార్జి వీసీ, ప్రస్తుత ఎన్నికల సంఘం కమి షనర్ పార్థసారధి, రిజిస్ట్రార్, ప్రస్తుత ఉన్నత విద్యామం డలి చైర్మన్ ఆచార్య రిక్క లింబాద్రి హయాంలో తెలంగా ణ విశ్వవిద్యాలయ న్యాక్ బీ-గ్రేడ్ను సాధించింది. ఐదేండ్ల కాలవ్యవధి గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. కరోనా పరిస్థితుల కారణంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు కూడా ముగియడంతో గుర్తింపు కోసం నివేదిక సమర్పించారు. రెండో దశలో సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ను పంపించడంపై వర్సిటీ ఉన్నతాధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు.
విశ్వవిద్యాలయంలో మెరుగైన గ్రేడ్ సాధనకు దరఖాస్తు చేయడంతో సరిపోదు. పాలకమండలి సమావేశంలో సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ను ఆమోదించిన తర్వాత న్యాక్ బృం దాన్ని ఆహ్వానించాల్సి ఉంటుంది. గత ఐదేండ్లలో యూని వర్సిటీ ప్రగతిని పరిశీలించి ఇంకా అవసరమైన పురోగ తి, మౌలిక సదుపాయాలను సూచిస్తుంది. అందుకు ఇప్పటి నుంచే వర్సిటీలోని చిన్నస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు సమష్టిగా పనిచేయాల్సి ఉంటుంద ని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
2015లో న్యాక్ పీర్ కమిటీ లోపాలు గుర్తించి రిపోర్ట్ను ఇచ్చింది. వసతిగృహాలు, ఉపాధి కల్పనకు దోహదపడే కొత్త కోర్సులు, పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు, ఇలా అనేక అంశాలు సూచించింది. ఆ లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్తేనే మెరుగైన గ్రేడ్ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఏ-గ్రేడ్ సాధిస్తే రూసా తదితర గ్రాంట్ల నుంచి ఎక్కువ నిధులు యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకులతో బోధన, ప్రోత్సాహకాలు లభిస్తాయి. విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటే అవకాశం ఉంటుంది.
వర్సిటీలో భవనాలు, పరిశోధనలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సైన్స్ భవనం నిర్మాణంలో ఉండగా ఆడిటోరియం, వసతులతో కూడిన క్రీడా మైదానం లేదు. గ్రంథాలయంలో సరైన పుస్తకాలు, కంప్యూటర్లు లేవు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. సుమారు 70కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అంశాల్లో వర్సిటీ వెనుకంజలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
న్యాక్ గుర్తింపు కోసం పాలకమండలి సమావేశంలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిగా సమావేశం ఊసేలేదు. వర్సిటీలో వరుసగా రిజిస్ట్రార్లు మారు తూ ఉన్నారు. పాలన పట్టు తప్పింది. ఈసీ సమావేశం లేకపోవడం, ఇన్చార్జి రిజిస్ట్రార్ కొనసాగడం అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ అనుబంధ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇటీవలే న్యాక్ ఏ-గ్రేడ్ సాధించడంతో ప్రిన్సిపాల్, సిబ్బందిని వీసీ అభినందించారు. ఈ తరుణంలో టీయూ వెనుకబడిన అంశంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.