ఖలీల్వాడి, జనవరి 27: ఇందూరు కంఠాభరణంగా నిలిచిన నీలకంఠేశ్వర ఆలయం రథ సప్తమి వేడుకలకు ముస్తాబయ్యింది. శనివారం రథసప్తమిని పురస్కరించుకొని జాతర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇందూరు నగరానికి ఈశాన్య భాగంలో స్వయంభూ లింగాకారంలో ఈశ్వురుడు కొలువైన కొవెల. 14 వందల ఏండ్ల క్రితమే నిర్మితమై జిల్లాకు తలమానికంగా.. నిలిచిందీ పురాతన ఆలయం. రెండు రోజలుపాటు కొనసాగే జాతరకు జిల్లావాసులతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. ఈ సప్తమిని చక్కర తీర్థం అని పిలుస్తారు. మాఘశుద్ధ సప్తమి రోజున స్వామి వారి విమానరథయాత్ర అని పిలుస్తారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి అభిషేకాలు, బిల్వపత్ర పూజలు నిర్వహించనున్నారు.
రథయాత్ర ప్రాశస్త్యం..
14 వందల ఏండ్ల క్రితం నిర్మించిన నీలకంఠేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. శాతవాహన వంశస్తులైన రెండో పులకేశి జైన మత ప్రచారానికి ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అదే స్థలంలో శివుడు స్వయంభూ లింగేశ్వరుడుగా నిలిచాడు. శాతవాహన కాలం ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత శిల్పి మాఘ శుద్ధ సప్తమి రోజున శిఖర స్థాపన చేయాలని నిర్ణయించుకున్న సమయంలో రోజూ మాదిరిగానే అతని తల్లి అన్నం తీసుకొని వచ్చింది. అమావాస్య రోజున శిఖర స్థాపన చేస్తున్న నేపథ్యంలో వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపో అని శిల్పి తల్లితో చెప్పారు. అ మాట విన్న తల్లి కొద్ది దూరం ప్రస్తుతం తల్లి ఘోరి ఉన్న చోట వరకు వెళ్లి తన కుమారుడు ఇలా ఎందుకు చెప్పాడో అనుకుంటూ వెనక్కి తిరిగింది. దీంతో శిల్పి అదృశ్యం కావడం, ఆ దుఃఖాన్ని భరించలేక తల్లి సమాధి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. అందుకే రథయాత్రను తల్లి ఘోరీ వరకు సాగిస్తారు.
నూతన రథం..
రథసప్తమిని పురస్కరించుకొని నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి కొత్తగా రథాన్ని తయారు చేయించారు. గద్వాల్కు చెందిన రథశిల్పి బాలబ్రహ్మేంద్రచారి ఆధ్వర్యంలో నూతన రథాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతమున్న ఆలయ రథం సుమారు వందేండ్ల క్రితం నాటిదని అందుకే కొత్త రథాన్ని తయారు చేయించారు. ఆలయం వద్ద తోరణాలు, బంతిపూలతో రథాన్ని అందంగా అలంకరించారు.
ముస్తాబైన ఆలయం.. ప్రత్యేక పూజలు
ఏటా రథసప్తమి రోజు నిర్వహించే జాతరకు పెద్ద సంఖ్య లో భక్తులు తరలివస్తుంటారు. స్థానికంగా ఉండి ప్రస్తుతం వివిధ దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం పుట్టింటికి చేరుకుంటారు. ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమం స్వామి వారికి అర్చనలు , అభిషేకలు నిర్వహించనున్నారు. సాయంత్రం కంఠేశ్వర్ ఆలయం నుంచి తల్లి ఘోరీ వరకు రథయాత్ర నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా కంఠేశ్వర్ ఆలయా న్ని విద్యుద్దీపాలతో అలకరించా రు. ఆలయానికి ఇరువైపులా తినుబండారాలు, పూలు, కొబ్బరికాయలు, చిన్న పిల్లల ఆట వస్తువుల దుకాణాలు వెలిశాయి. మంగళవారం చక్రతీర్థం నిర్వహించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు..
రథసప్తమి వేడుకల సందర్భంగా కంఠేశ్వర్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు. రైలే కమాన్ నుంచి కంఠేశ్వర్ (ఆర్మూర్ రోడ్డు) వైపునకు వెళ్లే వాహనాలు ప్రస్తుతం జిల్లా పరిషత్ చౌరస్తా నుంచి ఎడమ వైపునకు వెళ్తున్న వాహనాలను మంగళవారం ఉదయం నుంచి సుభాష్నగర్లోని రామాలయం రోడ్డు, ఉమెన్స్ కాలేజీ వైపునకు మళ్లించనున్నారు.