NDSL | శక్కర్ నగర్ : బోధన్ పట్టణం శక్కర్ నగర్ లో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసి కార్మికుల జీవితాలను రోడ్డుపై పారవేశారని కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్ రవిశంకర్ గౌడ్ ఆరోపించారు. శక్కర్ నగర్ లోని ఎన్ డి ఎస్ ఎల్ మెయిన్ గేట్ ఎదుట ఎంఐఎం పార్టీ నాయకులతో కలిసి శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటుపరంగా కొనసాగుతున్న నిజాం చక్కర కర్మాగారాన్ని యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా లే ఆఫ్ ప్రకటించి సుమారు 11 ఏండ్లు పూర్తయిన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని మరిచిందని ఆరోపించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ప్రారంభంలో ఓ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
బోధన్ ప్రాంత అభివృద్ధికి, పలువురు ఉపాధికి మార్గదర్శకంగా కొనసాగిన ఫ్యాక్టరీ మూసివేత కారణంగా బోధన్ బొందల గడ్డ గా మారిందని వారు ఎద్దేవా చేశారు. ఫ్యాక్టరీ మూసివేసిన నాటి నుంచి కార్మికులకు అందాల్సిన బెనిఫిట్స్ తో పాటు వేతనాలు కూడా లేక కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు రావలసిన వేతనాలను ప్రభుత్వం ఇప్పించి న్యాయం చేయాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడిన ఎంఐఎం ఎమ్మెల్యే బల్లాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, ఈరవేణి సత్యనారాయణ, ఎంఐఎం నాయకులు రఫీక్ సమీర్,కార్మికులు రాం బాబు, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.