IBS | ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడేవారిలో కడుపునొప్పి, ఉబ్బరం, అధిక గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. ఈ సమస్యలను నియంత్రించేందుకు ఆహారంలో కొన్ని మార్పులు చేయడం, ఒత్తిడిని తగ్గించడం, వైద్యుల సూచనలు పాటించడం కీలకం. ఈ నేపథ్యంలో మన దేశంలో చాలాకాలంగా ఉపయోగిస్తున్న సత్తు కూడా జీర్ణవ్యవస్థకు ఉపయోగకరమైన ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. శనగలను పొడిగా వేయించి తయారు చేసే సత్తులో పీచు, మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మలబద్ధకంతో కూడిన ఐబీఎస్ ఉన్నవారికి తగిన మోతాదులో సత్తు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
సత్తులో ఉండే కరిగే పీచు, రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి పేగుల్లో నీటిని గ్రహించి మలాన్ని సులభంగా బయటకు వెళ్లేలా చేయడంలో తోడ్పడతాయి. రెసిస్టెంట్ స్టార్చ్ పెద్దపేగుకు చేరిన తర్వాత అక్కడి మంచి బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నమై ఉపయోగకరమైన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లుగా మారుతుంది. ఇవి పెద్దపేగు ఆరోగ్యానికి, పేగుల లోపలి పొరను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అయితే ఐబీఎస్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఆహారం సరిపోదు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు సత్తును తక్కువ మోతాదుతో ప్రారంభించడం మంచిది.
ఉబ్బరం, కడుపులో గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలోనూ సత్తు కొంతవరకు సహాయపడుతుంది. పొడిగా వేయించే ప్రక్రియలో పప్పులోని కొన్ని గ్యాస్ కలిగించే పదార్థాలు తగ్గుతాయి. దీంతో సాధారణంగా పప్పుధాన్యాలు తిన్నప్పుడు ఎదురయ్యే అసౌకర్యం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. నీటిలో పలుచగా కలిపి తీసుకున్నప్పుడు సత్తు సులభంగా జీర్ణమయ్యే రూపంలో ఉంటుంది. దీనిలో వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా రాక్ సాల్ట్, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇవి జీర్ణక్రియకు తోడ్పడటంతోపాటు భోజనం తర్వాత వచ్చే కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
సత్తును తీసుకునే విధానంపైనా శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఒక పెద్ద గ్లాసు గది ఉష్ణోగ్రతలో ఉన్న లేదా గోరువెచ్చని నీటిలో ఒకటి నుంచి రెండు టేబుల్స్పూన్ల సత్తును కలిపి పలుచగా తయారు చేసుకుని తాగవచ్చు. ఉదయం మధ్య సమయంలో లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రివేళ తీసుకోవడం మాత్రం నివారించడం మంచిది. విరేచనాలతో కూడిన ఐబీఎస్ లేదా తీవ్రమైన సమస్యలు ఉన్నవారు సత్తును ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోకుండా ఒక టీస్పూన్ వంటి తక్కువ మోతాదుతో ప్రారంభించి శరీరం ఎలా స్పందిస్తుందో గమనించాలి. పీచును ఒక్కసారిగా ఎక్కువగా తీసుకుంటే కొందరిలో పేగుల కదలికలు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఐబీఎస్ ఉన్నవారు తమ లక్షణాలను బట్టి, అవసరమైతే వైద్యుల సలహాతోనే ఆహారంలో సత్తును చేర్చుకోవడం సురక్షితమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.