ఖలీల్వాడి, జూలై 26: ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్న ప్రజానీకం.. ఇప్పుడిప్పుడే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలోనే మంకీపాక్స్ మహమ్మారి ప్రజలను భయపెడుతున్నది. మంకీపాక్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దాదాపుగా తట్టు, అమ్మవారు లాంటిదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నందువల్ల జూనోటిక్ వ్యాధిగా పరిగణిస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకే కాదు, మనుషుల నుంచి మనుషులకూ సంక్రమిస్తున్నది. ఇది పక్కా అంటువ్యాధి. మన దేశంలోనూ నాలుగు మం కీపాక్స్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, వైద్యశాఖ బృందం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను మండలాలు, గ్రామాల వారీగా ఆశ వర్కర్లు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. లక్షణాలు కనిపిస్తే వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు పంపించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, అయినా వైద్యశాఖ అప్రమత్తంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
కామారెడ్డి వాసికి నెగెటివ్..
విద్యానగర్, జూలై 26 : ఇటీవల కా మారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి మంకీపాక్స్ లక్షణాలున్నాయనే విషయం కలకలం రేపింది. కువైట్ నుంచి వచ్చిన కామారెడ్డివాసికి అనుమానిత లక్షణా లు కనిపించగా.. వైద్య పరీక్షల కోసం అతని నుంచి సేకరించిన నమూనాల ను పుణె వైరాలజీ ల్యాబ్కు అధికారు లు పంపించారు. పరీక్షలు చేసిన అక్క డి వైద్యబృందం నెగెటివ్గా నిర్ధారించారు.
అప్రమత్తంగా ఉన్నాం..
నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. లక్షణాలు ఉన్న వ్యక్తు లు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు తెలియజేయాలి. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు హోంక్వారంటైన్లో ఉండాలి. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా.. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్ సుదర్శనం, జిల్లా వైద్యాధికారి, నిజామాబాద్