నిజామాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగా ప్రతినిధి)/బోధన్ ; తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలది ఓటు బంధమని విమర్శించారు. తాము ప్రజలను ఒక కుటుంబంలా భావిస్తామని, కానీ ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేసే ఈవీఎం యంత్రాల్లా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. బధన్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం, కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడారు. ఇంటింటికీ సంక్షేమం, సంతోషం తీసుకొచ్చిన బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని, సిన్సియారిటీగా పనిచేసే ఎమ్మెల్యే షకీల్ను ఆశీర్వదించాలని కోరారు.
‘సీనియారిటీ కావాలో.. సిన్సియారిటీ కావాలో.. ప్రజలు తేల్చుకోవాలని, బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను ఆశీర్వదించండి..’ అంటూ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోధన్ పట్టణం శక్కర్నగర్లోని నిజాంషుగర్స్ గ్రౌండ్స్లో వేలాదిమంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సుదర్శన్రెడ్డి బోధన్ నియోజకవర్గంలోని ఒక్క చెరువును కూడా బాగు చేయలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత 157 చెరువులను బాగు చేసుకున్నామన్నారు. ‘సుదర్శన్రెడ్డేమో పెద్ద వ్యాపారవేత్త.. షకీలేమో సామాన్య కార్యకర్త.. కష్టాల్లో పెరిగిన బిడ్డ.. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం షకీల్ది..’ ఇప్పుడు సీనియారిటీతో పోటీపడుతున్న సిన్సియార్టీ ఉన్న షకీల్ను మరోసారి భారీ మెజారిటీతో బోధన్ ప్రజలు గెలిపించాలని కోరారు.
ఒక్క రోజూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొననివారు, ఒక్కరికైనా ఉద్యోగం ఇవ్వనివారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వీరికి తెలంగాణ ప్రజలు బుద్ధిచెబుతారని ఆమె అన్నారు. బోధన్ నియోజకవర్గంలో మొత్తం 4,500 డ్వాక్రా గ్రూప్లు ఉండగా, వాటికి 2014 నుంచి ఇప్పటి వరకు రూ.2,600కోట్ల రుణాలను ప్రభుత్వం ఇచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటిది ఎప్పుడైనా చూశామా అన్నారు. తెలంగాణాలోనే లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు వచ్చాయని, ప్రైవేట్రంగంలో 30లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. ఇటీవల నిజామాబాద్లో ఐటీ హబ్ను ప్రారంభించిన రోజే 250 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈ నెల 29న నిజామాబాద్లో 50పెద్ద కంపెనీలతో జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. బోధన్లో సైతం ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్మేళాలో సుమారు 500 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి ఎన్నడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా.. ఎన్నడైనా బీజేపీ ఒక్క ఉద్యోగం తీసుకువచ్చిందా.. అంటూ కవిత ప్రశ్నించారు.
మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం
‘బీఆర్ఎస్ అంటే ఇంటి పార్టీ.. తెలంగాణ ప్రజలతో మమేకమై పేగుబంధాన్ని పెంచుకున్న పార్టీ.. మనది పేగుబంధం.. ప్రతిపక్షాలది కేవలం ఓటు బంధం.. ఈ విషయాన్ని పార్టీ బూత్లెవల్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలి’ అని ఎమ్మెల్సీ కవిత పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న విషయాన్ని వివరించాలన్నారు. త్వరలో బోధన్లో ‘గడప గడపకూ బీఆర్ఎస్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షకీల్ చేపట్టనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
రైతు సంక్షేమాన్ని తలచేది బీఆర్ఎస్ పార్టీయే..
రైతుల సంక్షేమం, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కవిత అన్నా రు. బోధన్ నియోజకవర్గంలోనే వెయ్యి మంది రైతు లు చనిపోగా, ఆ కుటుంబాలకు దినాల కన్నా ముందే రైతుబీమా కింద రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయా న్ని అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీలు, రజక, మంగలి, గొల్ల, కుర్మలు.. ఇలా ఏ కులమైనా కావచ్చు.. వారి అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో పాటుపడిందన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
శక్కర్నగర్, ఆగస్టు 16: బీఆర్ఎస్ పార్టీ సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉండి నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ గైని పోచయ్య బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆయనకు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జైతాపూర్ గ్రామానికి చెందిన పలు కుటుంబాలు బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరాయి.
ఓట్ల కోసమే వచ్చే నాయకులకు బుద్ధిచెప్పండి ఎమ్మెల్యే షకీల్
బోధన్ నియోజకవర్గ ప్రజలను కష్టకాలంలో ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, అవకాశవాదంతో గోడమీద పిల్లిలా ఉండి బీజేపీలోకి వెళ్లిన మోహన్రెడ్డి, రోజుకో పార్టీ మారుతూ బీజేపీలో ఉన్న ప్రకాశ్రెడ్డి తదితరులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తున్నారని, ఈ అవకాశవాద నాయకులకు మరోసారి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. తనపై పోటీచేయాలనుకుంటున్న నాయకులంతా కరోనా కష్టకాలంలో ఎక్కడ ఉన్నారంటూ షకీల్ ప్రశ్నించారు. మంత్రిగా ఉండి కూడా సుదర్శన్రెడ్డి బోధన్ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘ కరోనాలో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చాడా.. పేద బిడ్డ పెండ్లికి సహాయం చేశాడా.. ఎవరినైనా దవాఖానకు తీసుకెళ్లాడా.. రూ.20 వేల కోట్ల ఆస్తులను కుదువపెట్టుకున్న ఆ నాయకుడు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నాడు.. అతను మనకు అవసరమా..?’ అని షకీల్ ప్రశ్నించారు. ప్రజలపై ప్రేమతో కాకుండా ఎన్నికల ముందు కేవలం ఓట్ల కోసమే వచ్చే నాయకులను ప్రజలు తరిమితరిమి కొట్టాలని షకీల్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో, కవితక్క సహకారంతో బోధన్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, సుమారు రూ.2,600కోట్లు వివిధ పథకాల రూపంలో ప్రజలకు అందాయన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ బోధన్ నియోజకవర్గానికి రూ.300కోట్లు మంజూరుచేశారన్నారు.