ఖలీల్వాడీ, జూలై 21 : బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు 24 గంటల సమయం ఇస్తున్నానని, తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే సహించేదిలేని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె స్థానికంగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పని చేస్తోందని, అందుకే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. గతంలో పాలించిన పార్టీలు కమీషన్లకు కక్కుర్తి పడేవని, బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెంటబడి పరిష్కరిస్తే నిర్మాణం పూర్తయిందని చెప్పారు. నగరంలో ‘అండర్ గ్రౌండ్ డ్రైనేజీ’ డబ్బులు ఎవరు.. ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. అర్వింద్కు 24 గంటల సమయం ఇస్తున్నానని, తనకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలని, కాయితం పట్టుకురావాలని లేకపోతే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. తన తండ్రిని అంటే వదలేశామని, ఇప్పుడు తన భర్తను కూడా విమర్శిస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదన్నారు. మజాక్ చేస్తే బాగుండదని హెచ్చరించారు. రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తీస్తున్నారని అర్వింద్పై మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.
అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం..
అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయనను ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై గుంతలుంటాయా ఎక్కడైనా అని ప్రశ్నించారు. ఏం చేస్తున్నారని.. గడ్డి పీకుతున్నాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అన్ని విషయాలపై నిలదీస్తామన్నారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారని ప్రశ్నించారు. అబద్ధాల మీద సమాజం నడవదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలిచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అని విమర్శించారు. ధరణిని రద్దు చేసి దళారులను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆరోపించారు. పైసలున్న వారి పక్షాన మాత్రమే కాంగ్రెస్, బీజేపీ నిలబడుతాయని, బీఆర్ఎస్ ఎప్పుడూ పేదల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. గతం కన్నా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలువబోతున్నారని అనేక సర్వేలు తేల్చాయని ఆమె వెల్లడించారు.