మోర్తాడ్, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తే పేగులు మెడలేసుకుంట, బొందబెడ్త, కిందపడేసి తొక్కుత, జేబులో కత్తెరపెట్టుకుని తిరుగుతున్నానంటూ సీఎం రేవంత్రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మోర్తాడ్ మండలం సుంకెట్, దోన్పాల్ గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్న ప్రదేశానికి బుధవారం వేముల వెళ్లి కూలీలనుద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ప్రజలకు ఏ హామీ ఇచ్చినా అవి నెరవేర్చారని, చేసేవే చెప్పారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల్లో ఆశలు రేకేత్తించేలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్..120 రోజులు దాటుతున్నా వాటి విషయంలో ఎక్కడ వేసిన అక్కడే గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు.
రైతురుణమాఫీ ఇప్పుడు ఆగస్టు 15 అని చెబుతున్నాడని, ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుకుంటూ రైతులను ఆగం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మినహా ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేసిన దాఖలాలు లేవన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తానని హామీ ఇచ్చాడని, ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను అక్కడున్న కూలీలకు చూపించారు. అన్ని వర్గాలకు ఆశ చూపించి మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ సైనికుల్లా పనిచేయాలని వేముల సూచించారు. సుంకెట్, దోన్పాల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వేముల.. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను కలిసి ఎంపీ ఎన్నికల ప్రచార సరళి తదితర విషయాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ , బీజేపీలు ఇచ్చిన అబద్ధపు హామీలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను ప్రజలకు చూపిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు.పది గ్రూపులుగా ఏర్పడి ఒక్కో గ్రూపు 50 ఇండ్లకు వెళ్లి ప్రచారం చేయాలన్నారు. వీడియోలే ప్రచార అస్ర్తాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరాలని సూచించారు.
ఎంపీగా అర్వింద్ సుంకెట్, దోన్పాల్ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని తెలిపారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన అర్వింద్.. ఇప్పుడు తనను కాదని, మోదీ ముఖం చూసి ఓటు వేయాలని కోరడం విడ్డూరమన్నారు. పసుపుబోర్డు, మద్దతు ధర ఇప్పిస్తానని మోసం చేసిన అర్వింద్కు బుద్ధి చెప్పాలన్నారు. అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పకపోతే ఇంకా ఆగం చేస్తారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షానా పోరాడుతామని స్పష్టం చేశారు.