కమ్మర్పల్లి/వేల్పూర్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శవంతుడైన లౌకిక పాలకుడని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో వేముల సహకారంతో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయగా.. సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య విస్తరణకు పూనుకోవాలని పిలుపునిచ్చిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఆయన జీవించిన 50 ఏండ్లలో 27 ఏండ్లు మొగలులతో యుద్ధాలు చేస్తూ 300 కోటలను జయించిన మహావీరుడని పేర్కొన్నారు. ఛత్రపతి మొగలు రాజ్య విస్తరణను అడ్డుకున్నాడే తప్ప ఆనాటి ప్రజలను తారతమ్య దృష్టితో చూడలేదన్నారు.
శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉప్లూర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆవారి పటేల్ బృందం సభ్యులు, గ్రామయువకుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పిప్పెర అనిల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, వేల్పూర్లో ఎంపీటీసీ మొండి మహేశ్, మాజీ సర్పంచ్ తీగెల రాధామోహన్, మాజీ ఉపసర్పంచ్ పిట్ల సత్యం, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, రేగుల్ల రాములు, భోజన్న యాదవ్, ఛత్రపతి విగ్రహ సాధన కమిటీ అధ్యక్షుడు బి.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.