భీమ్గల్/ మోర్తాడ్, మే 2: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్, గోన్గొప్పులతోపాటు మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, దొన్కల్లో గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్షోల్లో వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని మాటిచ్చి ఇంతవరకూ అమలుచేయకపోవడం ప్రజలను మోసం చేయడమే అని మండిపడ్డారు.
కాంగ్రెస్ను నమ్మి మోసపోయామంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు అమలుచేయకుండా కాంగ్రెస్, పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్పేపర్ రాసిచ్చి, ఎర్రజొన్నలు, పసుపు, చెరుకుకు మద్దతు ధర కల్పిస్తామని బీజేపీ మోసం చేశాయని, ఇలా ఒకసారి మోసపోయారని, మరోసారి మోసపోతారా ప్రజలు ఆలోచించాలని సూచించారు.
ప్రజలు, రైతులను ఆశల పల్లకీలో మోసుకెళ్లేలా మాటలు చెబుతున్నారని, కానీ వాటిని అమలు చేయలేకపోయారన్నారు. ఎన్నికలు ఉన సమయంలోనే రైతుబంధు నాలుగెకరాల వరకు ఇచ్చేందుకు నాలుగు నెలలు పట్టిందని, ఎన్నికల తతంగం పూర్తయితే అదికూడా నిలిపివేస్తారని, ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ఒక్క గ్రామానికి రాలేదని, పనులు కూడా చేయించలేదని, ఇటువంటి వారికి ఓట్లు వేస్తే మనను ఏమనుకుంటారో ఆలోచించాలన్నారు.
ఐదేండ్లు ఎంపీగా ఉన్న అర్వింద్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి గ్రామాలకు వస్తున్నాడని ప్రశ్నించారు. దేవుడు, ప్రధాని మోదీ పేర్లతో ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. ప్రజల తరఫున పోరాడి, ప్రశ్నించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.