నిజాంసాగర్, మార్చి1: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మహ్మద్నగర్ మండల మండల కేంద్రంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై 234 మందికి కల్యాణలక్ష్మి, 95 మందికి షాదీముబారక్ చెక్కులను అందజేసిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా త్వరలో మహిళలకు రూ.2,500, రైతులకు రుణమాఫీని అమలుచేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు నియోజకవర్గంలో 500 బోరుబావులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నిజాంసాగర్ మండలం జక్కాపూర్-వడ్డెపల్లి-కొమలంచ గ్రామ శివారు ప్రాంతంలో నాగమడుగు మత్తడి నిర్మాణ పనులను ఎమ్మెల్యే లక్ష్మీకాంతా రావు పరిశీలించారు. మత్తడి వివరాలను మ్యాప్ ద్వారా తెలుసుకొన్నారు.