నస్రుల్లాబాద్, మార్చి 15 : బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం త్రిదండి దేవనాథరామానుజుల జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీగోదా సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్త, మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సతీమణి పుష్ప పాల్గొన్నారు.
ఉదయం 7 గంటలకు తీర్థ గోష్ఠి, విష్వక్సేన ఆరాధనం, ధ్వజరోహణం, మాడవీధుల్లో స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజారోహణ పూజా సమయంలో గరుడ పక్షులు ఆలయం చుట్టూ తిరిగాయి. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శంభురెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్రావు, అప్పారావు, నర్సరాజు తదిత రులు పాల్గొన్నారు.