సమైక్య పాలనలో ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీ చూసినా… ఏవీధిలోకి వెళ్లినా గుంతల రోడ్లు…వెలగని వీధి దీపాలు.. ప్రధాన రోడ్లు సైతం అంధకారం.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. 2007 సంవత్సరానికి ముందు మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 23వార్డులతో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఏర్పడింది. అరకొర నిధులతో 2014వరకు ఆర్మూర్ పట్టణంలో జరిగిన అభివృద్ధి అంతంతమాత్రమే. 2014లో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే జీవన్రెడ్డి కృషితో ఆర్మూర్ అభివృద్ధికి బాటలు పడ్డాయి.
ఆర్మూర్, సెప్టెంబర్ 30 : స్వరాష్ట్రంలో ఆర్మూర్ పట్టణ రూపురేఖలు మారాయి. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, బీటీ రోడ్లు, డివైడర్లు, హైమాస్ట్ లైట్లు, అద్భుతంగా చౌరస్తాలు.. ఇలా అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నదీ పట్టణం. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కృషితో ఆర్మూర్ పట్టణం ప్రగతిబాటలో పయనిస్తున్నది. పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో గ్రేడ్-2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. దీంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి పట్టణ సుందరీకరణపై దృష్టి సారించారు. పలు కాలనీల్లో పార్కులు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయడంతోపాటు పట్టణ పరిధిలోని చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణవాసులకు మౌలిక వసతులు కల్పిస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
పర్యాటక కేంద్రంగా సిద్ధులగుట్ట
పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టకు రూ.20.40కోట్లతో డబుల్ ఘాట్ రోడ్డును నిర్మించి, సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. సిద్ధులగుట్టపై మరో తొమ్మిది ఆలయాలను నిర్మించారు. గుట్టపై నుంచి ఏవైపు చూసినా సుందరమైన రోడ్లు, పిల్లల పార్కులతో పర్యాటక శోభను సంతరించుకున్నది. మరోవైపు గుట్టపై రూ.కోటితో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సోమవారం గుట్టపై పల్లకీసేవ, అన్నదానం నిర్వహిస్తున్నారు. సిద్ధులగుట్ట అభివృద్ధితో భక్తుల తాకిడి పెరిగింది. రానున్న రోజుల్లో గుట్టను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు.
వంద పడకల దవాఖాన…డయాలసిస్ సెంటర్
గతంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన కేవలం 30పడకల సామర్థ్యంతో కొనసాగేది. కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడేవారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక కృషితో రూ.16కోట్లతో దవాఖానను వంద పడకలకు పెంచారు. డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రజలకు సర్కారు వైద్యం మరింత చేరువ చేశారు. తొమ్మిదేండ్ల వ్యవధిలో ఆర్మూర్ దవాఖానలో 25వేలకు పైగా ప్రసవాలు జరిగాయి. అందులోనూ సాధారణ ప్రసవాలు అధికంగా జరగడం విశేషం. ప్రసూతి విభాగంలో ఆర్మూర్ దవాఖాన రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. మరోవైపు డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో ఆర్మూర్తోపాటు మెట్పల్లి, నిర్మల్ ప్రాంతాల నుంచి రోగులు వచ్చి సేవలు పొందుతున్నారు.
జిగేల్మంటున్న రోడ్లు..
ఒకప్పుడు ఆర్మూర్లో ప్రధాన రోడ్లు అంధకారంలో ఉండేవి. దీంతో రాత్రి సమయాల్లో బయటికి వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపేవారు కాదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇక్కడి ప్రజాప్రతినిధుల కృషితో ఆర్మూర్ రూపురేఖలు మారాయి. ఆర్మూర్ పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా మామిడిపల్లి చౌరస్తా వరకు డివైడర్లను నిర్మించి మధ్యలో అందమైన మొక్కలను నాటారు. మామిడిపల్లి చౌరస్తా నుంచి పెర్కిట్ వరకు, మామిడిపల్లి చౌరస్తా నుంచి మామిడిపల్లి గ్రామం వరకు రోడ్డు మధ్యలో ఇనుప కంచెలను ఏర్పాటు చేసి మొక్కలను నాటారు. డివైడర్ల మధ్యలో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేయడంతో రాత్రివేళల్లో జిగేల్మంటున్నాయి. జర్నలిస్టు కాలనీ రోడ్లో క్లాక్టవర్ ఏర్పాటు చేసి దాని ఎదుట వంద అడుగుల భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఈ క్లాక్ టవర్ త్రివర్ణ పతాక రంగులతో విరాజిల్లుతున్నది.
అద్భుతంగా.. అంబేద్కర్ చౌరస్తా..
పట్టణంలోని ప్రధాన కూడలి అంబేద్కర్ చౌరస్తా. అటు నిజామాబాద్, ఇటు ఆదిలాబాద్, వరంగల్ వెళ్లే ప్రయాణికులు ఈ అంబేద్కర్ చౌరస్తా మీదుగానే వెళ్లాలి. గతంలో అంబేద్కర్ చౌరస్తా ఇరుకుగా ఉండేది. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ప్రహరీ సైతం ప్రమాదాలతో ధ్వంసమయ్యేది. దీంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి అంబేద్కర్ చౌరస్తాను ఆధునీకరించారు. చౌరస్తాను విస్తరించి అంబేద్కర్ విగ్రహం చుట్టూ గ్రానైట్ రాళ్లతో సుందరంగా అలంకరించి ముస్తాబు చేశారు. పక్కనే నవనాథసిద్ధుల విగ్రహాలను ప్రతిష్ఠించి దాని వెనుకభాగంలో వాటర్ ఫౌంటేన్ను ఏర్పాటు చేశారు. దీంతో సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్న ప్రజలు.. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
గత పాలకుల హయాంలో ఆర్మూర్ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సమస్య తీవ్రతరం అయ్యేది. దీంతో మున్సిపల్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసేవారు. డబ్బులు పెట్టి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా ప్రజలు నీటిని కొనుగోలు చేసేవారు. నీటి కోసం గొడవలు జరిగి ఒకరి హత్యకు దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. సీఎం కేసీఆర్ పాలనలో ఆర్మూర్ పట్టణంలో తాగునీటి ఇబ్బందులన్నీ తీరాయి. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధమైన నీరు సరఫరా అవుతున్నది. రూ.508కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఆర్మూర్ పరిధిలో సుమారు 15వేల నల్లా కనెక్షన్లు, నియోజకవర్గ పరిధిలో 56వేల కనెక్షన్లు బిగించి, నీటిని సరఫరా చేస్తున్నారు.
పట్టణాభివృద్ధికి నిధుల మంజూరు
టీయూఎఫ్ఐడీఈ కింద బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.46కోట్ల 60లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.17 కోట్లతో పెర్కిట్, మామిడిపల్లి విలీన గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ సైతం పూర్తయ్యింది. మున్సిపల్ పరిధిలో అవసరమైన చోట మురికి కాలువల నిర్మాణానికి రూ.3కోట్ల 60లక్షలు, పట్టణంలో నాలుగు పార్కుల ఏర్పాటు రూ.కోటీ80లక్షల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తాం.
– ప్రసాద్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్
గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం…
హౌసింగ్బోర్డు కాలనీలో 18ఏండ్లుగా నివాసం ఉంటున్నాం. గతంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహాలక్ష్మీ కాలనీ మీదుగా హౌసింగ్బోర్డు కాలనీకి వచ్చే రెండు ప్రధాన రోడ్లు కంకర తేలి, అధ్వానంగా ఉండేవి. రాత్రి సమయంలో అంధకారంగా ఉండేవి. ఎమ్మెల్యే జీవన్రెడ్డి వచ్చిన తర్వాత రెండుమార్గాల్లో డబుల్ బీటీరోడ్లు వేశారు. దారి పొడవునా లైటింగ్ ఏర్పాటు చేయడంతో హౌసింగ్బోర్డు రోడ్డు సుందరంగా మారింది.
-ధర్పల్లి ముఖేశ్ గౌడ్, సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి, హౌసింగ్బోర్డ్ కాలనీ, ఆర్మూర్
ఆర్మూర్ ఎంతో మారిపోయింది
గతంలో మా కాలనీకి వెళ్లే రోడ్డు గుంతలతో అధ్వానంగా ఉండేది. ప్రస్తుతం మా కాలనీ రోడ్డు సుందరంగా మారింది. కాలనీలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ఎటుచూసినా ఆర్మూర్ పరిశుభ్రంగా కనిపిస్తున్నది. పార్కులు, ఓపెన్ జిమ్ములు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మిషన్ భగీరథతో నిత్యం రెండు పూటలు ఇండ్లలోకి నేరుగా నీళ్లు వస్తున్నాయి. ప్రధాన రోడ్లు, డివైడర్లు, మొక్కలతో సుందరంగా కనిపిస్తున్నది.
-మద్దికుంట శ్రావణ్, వెంకటేశ్వర కాలనీ, ఆర్మూర్
మినీ ట్యాంక్బండ్లు.. ఓపెన్ జిమ్ములు..
పట్టణంలోని గూండ్ల చెరువు, మల్లారెడ్డి చెరువు, పెర్కిట్ ఊర చెరువులపై రూ.9కోట్ల వ్యయంతో మినీ ట్యాంకుబండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, సైక్లింగ్ ట్రాక్లు, బోటింగ్, పిల్లల పార్కులు, ఓపెన్ జిమ్, ఐలాండ్లను ఏర్పా టు చేయనున్నారు. మరోవైపు హౌసింగ్బోర్డ్ కాలనీలో పార్కును ఏర్పాటు చేశారు. ప్రధాన కాలనీల్లో ఓపెన్ జిమ్లను నిర్మించారు. పట్టణంలో సుమారు 10-15 వరకు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడంతో ఉదయం, సాయంత్రం వేళలో ప్రజలు వ్యాయామం చేస్తూ ఫిట్నెస్ వైపు అడుగులు వేస్తున్నారు.