కమ్మర్పల్లి/కోటగిరి, డిసెంబర్ 5 : తమిళనాడు, ఆంధ్రాను మిగ్జాం తుపాను అల్లాడిస్తుండగా దాని ప్రభావంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం తెలంగాణ రైతులకు సైతం తిప్పలు కలిగిస్తున్నది. మిగ్ జాం తుపాను అలజడి మొదలైనప్పటి నుంచి వాతావరణం క్రమంగా చల్లబడుతూ వస్తున్నది. అసలే చలి కాలం..దానికి తోడు గాలిలో తేమ మరింత పెరుగుతున్నది. ఆకాశం మబ్బులు పట్టి ఉంటున్నది. అడపా దడపా చిరు జల్లులు కురుస్తున్నాయి. ఫలితంగా యాసంగి వరి నారు రంగు మారుతున్నదని ముందుగా నారు పోసుకున్న రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరణ వేగంగానే జరుగుతున్నా..మిగిలిన వడ్లు తుపాన్ ప్రభావంతో కల్లాలు, రోడ్ల పక్కన, కాలువల కట్టల పైన కవర్లలోనే నాలుగైదు రోజులుగా ఉంటున్నాయి.
రంగు మారుతున్న వరినారు
వానకాలం ధాన్యం సేకరణ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం యాసంగి సీజన్ సైతం ప్రారంభమవుతున్నది. నీటి సౌకర్యాన్ని బట్టి ఎప్పటిలాగే కొంత మంది రైతులు కాస్త ముందుగానే యాసంగి నారు పోసుకున్నారు. 20 రోజుల క్రితమే పోసిన నారు మరో పదిహేను, ఇరవై రోజుల్లో నాట్లు వేసుకునే దశకు చేరుకుంటుంది. ఈ దశలో మిగ్జాం తుపాను ప్రభావంతో చలి పెరిగింది. వాతావరణం మబ్బు పట్టి ఉంటుండడంతో అవసరమైనంత ఎండ మడిలో నారుకు తగలని పరిస్థితి ఏర్పడింది. ఇలా చలి ప్రభావంంతో కాస్త ముందుగా పోసుకున్న నారు ఎరుపు రంగుకు మారే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. రంగు మారితే నత్రజని వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్త రంగు ఎక్కువ మారితే అదీ పని చేయదంటున్నారు. మరో వైపు ఈ సమయానికి నారు పోసుకునే రైతులు ప్రస్తుత చల్లని వాతావరణం తగ్గితే నారు పోయడానికి మొలకలు నానబెట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఈ వాతావరణంలో పోస్తే మొలకెత్తిన నారు చల్లదనానికి, చిరు జల్లులకు మురిగి పోతుందని చెబుతున్నారు. మిగ్జాం ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు.
ధాన్యం రాశులను కాపాడుకోవడానికి తిప్పలు
మరో వైపు వాన కాలం ధాన్యం సేకరణ కొనసాగుత్నుది. రైతులు వడ్లను ఆరబెట్టి కొనుగోలు కేంద్రంలో కాంటా వేసుకునే వరకు తగు తేమ శాతం ఉండేలా కల్లాల వద్ద వడ్ల కుప్పలను చలి నుంచి కాపాడుకుంటున్నారు. ఈ తరుణంలో తుపాన్ కారణంగా చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ధాన్యం రాశులపై కవర్లు కప్పి కాపాడుకుంటున్నారు. తుపాన్ ప్రభావం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు.
రైతుల గుండెల్లో గుబులు
ఉమ్మడి కోటగిరి మండలంలోని ఆయా గ్రామాల సమీపంలో వందలాది ఎకరాల్లో వరి పంట కోత దశలో ఉంది. తుపాను కారణంగా వర్షం కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షం కురవడంతో కొంత పంట తడిసింది. మళ్లీ కొత్తగా తుపాను రావడంతో మళ్లీ అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో రైతులు భయందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వడ్ల రంగు మారడంతో పాటు మొలకలు వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. తుపాను ప్రభావంతో వడ్లు తడిస్తే గిట్టుబాటు ధర కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.