నిజామాబాద్ క్రైం, ఆగస్టు 28 : నగరంలోని వినాయక్నగర్లో ఉన్న టీ-మార్ట్ సూపర్ మార్కెట్లో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని జేసీబీతో షట్టర్లను తొలగించి మంటలు ఆర్పారు. అప్పటికే షాపులో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కారణాలను గుర్తించలేకపోయారు. అగ్ని ప్రమాదం సంఘటన పై అటు అగ్నిమాపక శాఖ, ఇటు విద్యుత్ శాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.
షాపులో వారు పలు ఆధారాలను సేకరించారు. వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలపై నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. కానీ ఈ సంఘటన పై సూపర్మార్కెట్ యజమాని నేతి శేఖర్ మాత్రం షాపు తగలబడి పోవడానికి ముగ్గురు భాగస్వాములు ఉదయ్, సంతోష్, శేఖర్ కారణమని, వారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాల్గోటౌన్ ఎస్సై సందీప్ తెలిపారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.