నిజాంసాగర్, ఆగస్టు 29 : సీఎం కేసీఆర్ గిరినుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో మంగళవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నునావత్ బాబు సింగ్ ఆధ్వర్యంలో గౌరారం తండా, కోమటి చెరువు తండా బంజరా నాయకులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బంజారా గిరిజనులు ఎంతో అభివృద్ధి సాధించారని.. గత పాలకుల హయాంలో ఇంత అభివృద్ధి చూడలేదన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిలో నిలిపారని .. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్షిండే చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాట్రోత్ రవీందర్ నాయక్, నాయకులు రవి, దేవ్రావ్, శ్రావణ్, దూప్సింగ్, హరిచంద్ తదితరులు ఉన్నారు.