ఖలీల్వాడి/ నిజామాబాద్ స్పోర్ట్స్/ పిట్లం, జనవరి 11: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలోని లారీ డ్రైవర్లు, క్లీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఐపీసీ 304/ఏ సెక్షన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ కలెక్టరేట్ ఎదుట, పిట్లం మండలకేంద్రంలో లారీ, డీసీఎం ఓనర్స్, డ్రైవర్లు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్లో అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి.దావూద్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెక్షన్ 304/ఏ ద్వారా డ్రైవర్ల జీవితాలు అయోమయంలో పడ్డాయన్నారు.
లారీ, డీసీఎం ఓనర్లకు ఇబ్బంది కలిగించే సదరు సెక్షన్ను రద్దు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నవీద్ పాషా, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పిట్లంలో నిర్వహించిన ధర్నాలో అధ్యక్షుడు కరీం, గౌరవ అధ్యక్షుడు మిర్జా సలీం, ఉపాధ్యక్షులు బుడాల నవీన్, మొయిదిన్ పాటిల్, కార్యదర్శి హన్మాగౌడ్, కో శాధికారి ఆసీఫ్ బేగ్, ఆర్గనైజర్ ఖుద్దూస్, ముఖ్య సలహాదారులు లక్ష్మణ్, మహెబూబ్, యాదుల్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.