రెంజల్, ఫిబ్రవరి 20 : నాలుగు వందల ఏండ్లక్రితం ఓ గుట్టపై రాతి బండలో వెలసిన వీరభద్రుడు భక్తుల కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలోని స్వామివారి రథోత్సవం, జాతరకు ఆలయం ముస్తాబైంది. ఉత్సవాల నేపథ్యంలో గుట్టపై ఉన్న అయలం, రథానికి రంగులు వేశారు. స్వామివారికి మంగళవారం ఉదయం అభిషేకం, కుంకుమార్చన తదితర విశేష పూజలతోపాటు భక్తులకు అన్నదానం చేయనున్నారు.
వీరభద్రుడి ఆలయంలో శివరాత్రి తర్వాత నెలపొడుపు నుంచి ఉత్సవా లు నిర్వహిస్తా రు. శివరాత్రి మూడోరోజైన సోమవారం సాయంత్రం రెంజల్లోని వీరభద్ర స్వామి ఆలయ అర్చకుడు జంగం నాగ్నాథ్ అప్పా ఇంటి నుంచి వీరభద్రుడి ఉత్సవ మూర్తులను భాజా భజంత్రీల మధ్య వీరన్నగుట్టకు భక్తులు తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి అగ్ని గుండాలను ఏర్పాటు చేశారు. భక్తులు అందులోనుంచి నడి చి తమ భక్తిని చాటుకున్నారు. మంగళవారం జాతర, రథోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సర్పంచ్ బైండ్ల రాజు తెలిపారు.
స్వామివారి పేరిటే గ్రామం..
ఈ ప్రాంతంలో సుమారు 2,500 ఎకరాల విస్తీర్ణంలో రైతులు చెరుకును పండించేవారు. నిజాంచక్కెర కర్మాగారానికి ఈ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో చెరుకును సరఫరా చేసేవారు. అప్పుడు దాదాపు నాలుగువేల మందితో ఉన్న సాటాపూర్ ఫారం పంచాయతీగా ఏర్పాటైంది. కాలక్రమేణా జనాభా పెరగడంతో కొన్ని కుటుంబాలు వీరన్నగుట్ట పరిసర ప్రాంతంలో నివాసాలను ఏర్పర్చుకున్నాయి. మరికొందరు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ గ్రామానికి గుట్ట పైభాగంలో వీరభద్ర స్వామి ఆలయం ఉండడంతో వీరన్నగుట్ట గ్రామంగా పేరు పెట్టుకున్నారు. అలా వెలిసిన వీరభద్రస్వామి పరిసర గ్రామాలతోపాటు మహారాష్ట్ర వాసులకు సైతం కొంగు బంగారమయ్యాడు. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతుండడంతో మహిమలుగల స్వామిగా ప్రసిద్ధి కెక్కాడు.