నిజామాబాద్ : లండన్లోని క్రొయిడాన్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గొంతి అభిషేక్ ప్రాణాలు కోల్పోగా.. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్కు చెందిన సాయి శ్రీకర్ను వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధరించారు.
బ్రెయిన్డెడ్ నేపథ్యంలో సాయి శ్రీకర్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించినట్లు నిజామాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉండే అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. సాయి శ్రీకర్, గొంతి అభిషేక్ ఇద్దరూ ఒకే రూమ్లో ఉంటున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన వీళ్లు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగిన ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఈ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్న మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. లండన్ డుప్పాస్ హిల్స్ టెర్రాస్లోని రెండు అంతస్తుల నివాసంలో గత మంగళవారం రాత్రి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. దాంతో మంటలంటుకుని సాయి శ్రీకర్, గొంతి అభిషేక్ మరణించారు.