వేల్పూర్, మార్చి 26 : కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఆ తర్వాతే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయకుంటే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వేల్పూర్లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్కు నీళ్లను తీసుకొచ్చి రైతుల పంటలకు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదు, రైతులు సాగునీరు అడుగుతుంటే పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. పై పెచ్చు పోచంపాడ్ డ్యామ్ నుంచి వరదకాలువ ద్వారా ఆలోకేషన్ కన్నా ఎక్కువ నీరు కిందికి తరలిస్తూ ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. కప్పలవాగు, పెద్దవాగుల్లో అనేక చెక్డ్యామ్లు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించామని, ప్యాకేజీ 21 ద్వారా కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు వదిలితే వాగు వెంట ఉన్న బోర్లలో నీళ్లు వచ్చి సుమారు 40వేల ఎకరాలకు మేలు చేకూరేదన్నారు.
వాగుల్లో 0.5 టీఎంసీల నీరు వదలమని ఎన్నిసార్లు రైతుల తరఫున విన్నవిస్తూ లేఖలు రాసినా ఈ చెవిటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇదీ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 110 రోజులు కూడా గడిచిందని, వెంటనే రైతు రుణమాఫీ చేయాలన్నారు. అప్పులు కట్టాలని రైతులకు బ్యాంకు అధికారులు లీగల్ నోటీసులు ఇస్తున్నారని, రేవంత్రెడ్డి ఏం చెప్పారో తమకు సంబంధం లేదని, రుణాలు కట్టాల్సిందేనని రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. రైతులెవరూ బ్యాంకు రుణాలు కట్టాల్సిన అవసరం లేదని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం వెల్లదీస్తే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతామని హెచ్చరించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలో రైతన్నలు ఒకసారి ఆలోచించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి, ముస్కు భూమేశ్వర్, శేఖర్రెడ్డి, ఎంపీపీలు బీమా జమున, జడ్పీటీసీలు తలారి గంగాధర్, నాయకులు నర్సారెడ్డి, మిట్టాపల్లి మహిపాల్, సామ మహిపాల్, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.