వినాయక్నగర్, మార్చి 24: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు హోలీ పండుగా ప్రశాంతంగా జరుపుకోవాలని, మద్యం మత్తులో ఎలాంటి అల్లర్లు, గొడవలకు పోకుండా సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హోలీ పండుగ వేళ మద్యం, కల్లు సేవించి రోడ్లపై హంగామా చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అండర్ సెక్షన్ 20(1) ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు దుకాణలు, కల్లు డిపోలు, బార్లు, వైన్స్,క్లబ్లు మూసి ఉంచాలని సీపీ ఆదేశాలు జారీచేశారు. 24వ తేదీ సాయంత్రం 6 నుంచి 26వ తేదీ మంగళవారం ఉదయం వరకు లిక్కర్ షాపులు బంద్ చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.