సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని, ప్రపంచంతో పోటీ పడగలిగే సత్తా ఉంటే మిమ్మల్ని ఆపేవారే లేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్య తోడైతే అద్భుత ఫలితాలు వస్తాయని, నేడు కంప్యూటర్లే మానవ మేధస్సును అధ్యయనం చేస్తున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు మొక్కుబడిగా డిగ్రీలు పూర్తి చేయకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని, గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఐకేరెడ్డితో కలిసి అమాత్యుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 36 మందికి గోల్డ్మెడల్స్, 576 మందికి పట్టాలు అందజేశారు. అంతకుముందు ట్రిపుల్ ఐటీ కాన్ఫరెన్స్హాల్లో ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్తోపాటు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రతినిధులతో డైరెక్టర్ సతీశ్కుమార్ ఒప్పందం (ఎంవోయూ) చేసుకోగా, త్వరలోనే మినీ టీహబ్ను ఏర్పాటు చేసి విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుకు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
మా మమ్మీడాడీ హృదయ రాజు-సుగంధ. ఇద్దరు ప్రైవేట్ టీచింగ్ చేస్తరు. నన్ను, తమ్మున్ని కష్టపడి చదవించిన్రు. 2015లో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన. సిక్స్ ఇయర్స్ కష్టపడి చదివిన. కెనడా దేశానికి చెందిన ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా జాబ్ కొట్టిన. సంవత్సరానికి రూ.30 లక్షలు ప్యాకేజీ. ఫుల్ హ్యాపీ. నా తమ్ముడు సీఏ చేస్తున్నడు. నేను మంచి జాబ్ కొట్టడం వెనుక మమ్మీడాడీ, యూనివర్సిటీ లెక్చరర్స్ సపోర్ట్ ఉన్నది.
– సుమన్, పీహెచ్సీ బ్రాంచ్ టాపర్ (గోల్డ్మెడలిస్ట్), మహబూబాబాద్ జిల్లా.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం త్రీ-డీ వైపు చూస్తున్నది. రాబోయే 20 ఏండ్లలో ఈ విధానం విస్తరిస్తుంది. త్రీ-డీ అంటే మొదటిది డిజిటలైజేషన్, రెండోది డీ కార్బొనైజేషన్, మూడోది డీ సెంట్రలైజేషన్. భవిష్యత్తులో అపారమైన అవకాశాలు అందించే ఈ త్రీ-డీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.