పడగల్ ప్రాథమిక పాఠశాలలో 2014-15 నుంచే ఆంగ్ల బోధన
మంత్రి, వీడీసీ, గ్రామస్తుల సహకారంతో అదనపు గదులు
దాతల సాయంతో తరగతి గోడలపై పెయింటింగ్
ప్రైవేట్కు దీటుగా విద్యా బోధన
నాడు 36 మంది.. నేడు 350 మంది విద్యార్థులు
ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరింత ప్రయోజనం..
వేల్పూర్, ఫిబ్రవరి 3: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆంగ్లమాధ్యమంలో బోధనపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగిస్తున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లకు పంపించేవారు. దీంతో పిల్లలు ఇంటికి వచ్చే వరకు ఎదురుచూపులు తప్పేవికాదు. గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని భావించారు. దీంతో వీడీసీ సభ్యులతో పాటు గ్రామస్తులు తమ గ్రామంలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని డీఈవోకు విన్నవించారు. స్పందించిన ఆయన ఆంగ్ల మధ్యమానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2014-15లో గ్రామంలో ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. 36 మంది విద్యార్థులతో కొనసాగిన పాఠశాలలో ప్రస్తుతం 350 మంది చదువుతుండడం విశేషం. విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, వీడీసీ సహకారంతో మూడు అదనపు గదులను నిర్మించారు. గ్రామంలోని కొందరు దాతలు అందించిన రూ.50వేలతో పాఠశాలలోని ప్రతి తరగతి గదిని అందంగా అలకరించారు. పాఠశాల గోడలపై బొమ్మలను పెయింటింగ్ వేయించారు. విన్నూత రీతిలో బోధన అందించేందుకు చిత్రాలను గీయించారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ఉండడానికి తమ వంతు కృషి చేస్తున్నామని పూర్వ విద్యార్థులు అంటున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ముగ్గురు విద్యావలంటీర్లతో బోధన సాగిస్తున్నారు. ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో స్థానిక విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.