లింగంపేట, డిసెంబర్ 27: మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తంచేశారు. పంచాయతీలకు సంబంధించిన 15వ ఫైనాన్స్ నిధులు సర్పంచులకు తెలియకుండా అధికారులు డ్రా చేయడంపై వారు నిరసన తెలిపారు. సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా డిజిటల్ కీ పేరిట మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారి, పంచాయతీ కార్యదర్శులు డ్రా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషమయమై పంచాయతీ కార్యదర్శులను ప్రశ్నించగా.. ఎంపీవో ఆదేశాల మేరకు డబ్బులు డ్రా చేసినట్లు సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీడీవో కార్యలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఎంపీవోను సర్పంచులు ప్రశ్నించారు. డబ్బులు డ్రా చేసిన విషయం వాస్తవమే అని ఆయన అంగీకరించారు. డ్రా చేసిన డబ్బులను తిరిగి పంచాయతీల అకౌంట్లలో జమ చేస్తామని ఎంపీవో సమాధానం ఇచ్చారు. తమకు సమాచారం లేకుండా డబ్బులు డ్రా చేయొద్దని సర్పంచులు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కూడా సర్పంచులతో మాట్లాడారు. ఎంపీవో ప్రభాకర్ చారిని వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్బులు డ్రా చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బండి రాజయ్య, రాజశేఖర్రెడ్డి, సతీశ్, జీల్యా, అనిల్రెడ్డి, ఆశయ్య, గోవింద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ కీని సర్పంచులకు అప్పగించాలని వినతి..
15వ ఆర్థిక సంఘం నిధుల డ్రా కోసం ఏర్పాటుచేసిన డిజిటల్ కీని తమకు అప్పగించాలని మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఇన్చార్జి ఎంపీడీవో అతినారపు ప్రకాశ్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండానే దారి మళ్లించారని, డిజిటల్ కీల ఏర్పాటుకు సంతకాలు తీసుకున్నారని, అయినా ఇప్పటివరకు వాటిని జీపీలకు ఇవ్వలేదన్నారు. వెంటనే డిజిటల్ కీలు అందజేసి, డ్రా అయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే ఖాతాలో జమ చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.