జక్రాన్పల్లి, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా మతాలకతీతంగా అన్ని వర్గాల పండుగలను నిర్వహిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో దేవాలయాలను అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ నిధుల కోసం 33 శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉండేదని.. అది కట్టినా మూడు లేదా నాలుగేండ్ల వరకు నిధుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. కానీ ప్రస్తుతం 33 శాతాన్ని 20 శాతానికి తగ్గించి ఎదురు చూడకుండానే నిధులను ఇస్తున్న గొప్ప వ్యక్తి సీఎం అన్నారు. ఆలయాల్లో అర్చకులకు సమైక్య పాలనలో దీపధూప నైవేద్యాలకు కేవలం రూ.1800 మాత్రమే ఇచ్చేవారని, మన ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తున్నదని తెలిపారు. అంతేగాకుండా ప్రధాన ఆలయాల్లో అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తోందన్నారు. రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని, కల్లబొల్లి మాటలు చెప్పేవారిని నమ్మవద్దన్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల రాములు, ఎంపీపీ ఢీకొండ హరిత, జడ్పీటీసీ తనూజారెడ్డి, వైస్ ఎంపీపీ కుంచాల వి మల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజ న్న, సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్ పాల్గొన్నారు.