ఖలీల్వాడి, జూలై 13: ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరముంటేనే బయటికి రావాలని, లేని పక్షంలో ఇంటికే పరిమితం కావాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి పత్రిక ప్రకటన విడుదల చేశారు. గ్రామాల్లో ఆరుబయట ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇందల్వాయి నుంచి ధర్పల్లి వెళ్లే మార్గంలో లింగాపూర్ వాగుపై ప్రమాద స్థాయిలో ఉధృతంగా వరదనీరు ప్రవహిస్తున్నందున రోడ్డు మార్గం మూసివేసినట్లు తెలిపారు.
ధర్పల్లి-సిరికొండ మండలాల ప్రజలు రాంపూర్-లోలం, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మీదుగా వెళ్లాలని కోరారు. రెవెన్యూ, పోలీస్ ఇరిగేషన్ శాఖల అధికారులతో 24 గంటలపాటు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున ఆర్టీసీ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో బుధవారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు బయటికి రావొద్దని పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూళిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.