నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 20 :కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ శివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి 104 ఏండ్లు గడిచాయి. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. మంజీరా నదికి ఉపనది అయిన ఆలేరు వాగుపై నిజాంప్రభు 1916 నుంచి 1918 వరకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు వానకాలం, యాసంగి రెండు పంటలకు ఈ పోచారం జలాశయం తాగు, సాగు నీరు అందిస్తున్నది. అప్పట్లోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నీరందించేలా రూపకల్పన చేశారు. ప్రతి సంవత్సరం వానకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు తాగు, సాగు నీరు అందిస్తున్నది. ఆ కాలంలో రెండు జిల్లాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు నిర్మించడం ఇక్కడి ప్రజలకు వరంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట్, గుండారం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుంది. నాగిరెడ్డిపేట్ మండలంతోపాటు ఎల్లారెడ్డి మండలాన్ని కలిపి 18వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. 13 కాలువల ద్వారా పంటలకు నీరందిస్తున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు (1464 ఎంసీఎఫ్టీ).
ప్రాజెక్టు గొప్పతనం..
రెండు జిల్లాల సరిహద్దుల్లో పోచారం ప్రాజెక్టు నిర్మించి నీరందించేలా రూపకల్పన చేశారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు నీరందిస్తూ.. మెదక్ జిల్లాలోని బుర్గుపల్లి, వాడి, రాజిపేట్, గ్రామాల బోరుబావులకు పోచారం నీళ్లే ఆధారం. పోచారం ప్రాజెక్టు నిండిన తర్వాత పొంగి ప్రవహించిన నీరు వృథా కాకుండా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్లేలా నిర్మించారు. మెదక్ జిల్లా ఘన్పూర్ కెనాల్ నుంచి పోచారం ప్రాజెక్టులోకి నీరు వచ్చేలా రూపకల్పన చేశారు. అప్పట్లో కేవలం డంగు సున్నం, సుత్తె రాయితో ప్రాజెక్టును నిర్మించారు.104 సంవత్సరాలు దాటినా నేటికీ చెక్కు చెదరకుండా ఉండడం ఇంజినీర్ల మేథాశక్తి నిదర్శనంగా చెప్పవచ్చు.
బ్రిడ్జి నిర్మాణం అద్భుతం
కామారెడ్డి జిల్లా మీదుగా మెదక్ జిల్లాకు వెళ్లేలా బ్రిడ్జిని నిర్మించారు. ప్రతిరోజు ఈ బ్రిడ్జి పైనుంచి వందల సంఖ్యలో వాహనాలు మెదక్ పట్టణం మీదుగా హైదరాబాద్ వెళ్తుంటాయి. గత 18సంవత్సరాల క్రితం మావోయిస్టులు ఈ బ్రిడ్జిని కూల్చడానికి బాంబు పెట్టారని, అయినా బాంబుదాడిని తట్టుకొని నిల్చున్నదని స్థానికులు చెబుతారు.
చెక్కు చెదరని కట్టడాలు
నిజాంరాజులు ఈ ప్రాంతంలో విడిది కోసం ఎత్తయిన గుట్టపై నిర్మించిన పురాతన కట్టడాలు చెక్కు చెదరలేదు. ఈ ప్రాజెక్టు పక్కనే పోచారం అభయారణ్యం కనువిందు చేస్తున్నది. నిజాం రాజులు ఈ ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు హైదరాబాద్ నుంచి వచ్చేవారని పూర్వీకులు చెబుతుంటారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గుట్టపైకి రోడ్డుమార్గాన్ని నిర్మించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి 36 కి.మీ, నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 90కి.మీ, రాజధాని హైదరాబాద్ నుంచి 110 కి.మీ, మెదక్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో పోచారం ప్రాజెక్టు ఉన్నది.
వేలాదిగా పర్యాటకులు..
వేసవికాలంలో వలస పక్షులు ఈ ప్రాంతంలో సందడి చేస్తాయి. ఈ అభయారణ్యంలో జింకలు, దుప్పిలు, నెమళ్లు, అడవిపందులతోపాటు ఇతర జంతువులు సంచరిస్తుంటాయి. ఉదయం, సాయంత్రం ప్రాజెక్టు పరిసరాల్లో పక్షులు కనువిందు చేస్తుంటాయి. వీటిని చూసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగానే మత్తడి దుంకుతాయి. ఆ నీటిని చూసేందుకు, ఆ నీటిలో జలకాలాడడానికి వేలాదిగా పర్యాటకులు వస్తుంటారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నర్సాపూర్, రామాయంపేట్, తుప్రాన్, చేగుంట, హైదరాబాద్.. ఇవి కాకుండా దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పోచారం అందాలు తిలకించడంతోపాటు కెమెరాలతో బంధిస్తారు.