ప్రభుత్వ సహకారంతో నిరంతర ఉపాధి దక్కాలి
రూ.10లక్షలు ఖర్చు చేయడంముఖ్యో ద్దేశం కాదు..
దళితుల అభ్యున్నతికివ్యక్తిగతంగా సహకారం అందిస్తున్నా..
పథకం పర్యవేక్షణకు దళిత నాయకులు, రిటైర్డ్ ఆఫీసర్లతో కమిటీ
నిజామాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):‘దళితుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ అట్టడుగు వర్గాల అభ్యున్నతి వారికి పట్టలేదు. అందుకు భిన్నంగా వారంతా ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష. అందుకే దేశచరిత్ర లోనే కనీవినీ ఎరుగని రీతిలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు’ అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పథకం అమలు తీరుతెన్నులపై ఆయన సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికలో స్వయంగా పాల్గొనడంతోపాటు యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులకు సహాయ, సహకారాలు అందిస్తానని వెల్లడించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని సురేందర్ తెలిపారు. శాశ్వత ఉపాధి కల్పించే యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకునేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
దళితబంధు ద్వారా పేద దళితులకు శాశ్వత ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఏడున్నర దశాబ్దాలు గా ఆయా రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే చూశాయని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా సీఎం కేసీఆర్ వినూత్నంగా ఆలోచించి వారి బతుకులను మార్చేందుకు నడుం బిగించారని చెప్పారు. దళితులను ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఆలోచనలో భాగంగానే దళితబంధు పథకాన్ని అమలుచేసి చూపించబోతున్నారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికలో తాను పాల్గొనడంతో పాటు యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు సహాయ, సహకారాలు అందించేందుకు ముందుంటానని అన్నా రు. వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుండగా… వారికి ఉపాధి కల్పన కోసం అండగా నిలుస్తానంటూ చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, త్వరలోనే యూనిట్లు మంజూరు అవుతాయని చెప్పారు. రూ.10లక్షలతో వారి జీవితాల్లో శాశ్వత ఉపాధితో వెలుగులు అందాలని ఆకాంక్షిస్తున్నట్లు సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ వివరాలు మీ కోసం..
నమస్తే : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు ఎంత వరకు వచ్చింది?
ఎమ్మెల్యే : నా నియోజకవర్గంలో 100 యూనిట్లకు వంద మంది లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్కు జాబితాను అందించాం. వీరందరికీ మార్చి నెలాఖరులోపే యూనిట్లు చేతికొస్తాయి. మొత్తం ప్రక్రియను నెలన్నర రోజుల్లోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మేము వంద మందిని ఎంపిక చేసిన అనంతరమే బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడంతో సహా మిగిలిన ప్రాసెస్ను జిల్లా యంత్రాంగం ఇప్పటికే మొదలు పెట్టింది.
ఈ పథకం అమలుకు ప్రభుత్వ మార్గదర్శకాలే పాటించారా? ప్రత్యేకంగా మీరేమైనా చొరవ చూపుతున్నారా?
ప్రభుత్వం కల్పిస్తున్న అద్భుత అవకాశాలతో పేదల జీవితాల్లో మార్పు కనిపించాలి. రూ.10లక్షలను లబ్ధిదారుల చేతికి అందించి చేతులు దులుపుకోవడం సరికాదు. వాటి వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు లబ్ధిదారుడికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే నేను స్వయంగా నా నియోజకవర్గంలో ఒక్కో యూనిట్పైనా ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాను. వారు ఎలాంటి యూనిట్ ఎంచుకునేది వారి ఇష్ట మే. వాటి అమలుకు ప్రత్యేకంగా గ్రామ, మండల స్థాయిల్లో దళిత మేధావులు, దళిత నాయకులు, రిటైర్డ్ దళిత ఉద్యోగులను భాగస్వామ్యం చేశాను. వీరు ప్రతిరోజూ దళితబంధు లబ్ధిదారులతో టచ్ లో ఉంటారు. వారికి వచ్చే సందేహాలను తీరు స్తూ… సలహాలు, సూచనలు ఇస్తారు. క్షేత్ర స్థాయి లో లోపాలుంటే వారంతా కలిసి నాకు సమాచారాన్ని ఇస్తారు. ఇలా ఓ పద్ధతి ప్రకారం ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి నేను పెట్టుకున్న రూట్ మ్యాప్.
దళితబంధు పథకం 100 యూనిట్లను ఏ రకంగా విభజించుకున్నారు?
ఇప్పుడు నియోజకవర్గానికి మంజూరైన దళితబంధు యూనిట్లు వంద మాత్రమే. మార్చి నెలాఖరులోగా వీటిని లబ్ధిదారులకు అందిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరింత మంది కి మరిన్ని యూనిట్లు వస్తాయి. ఇంతకన్నా రెట్టింపు స్థాయిలో నియోజకవర్గానికి మంజూరవుతాయి. అప్పుడు చాలా మందికి ఈ పథకాన్ని తీసుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న యూనిట్లను లింగంపేట మండలంలోని పోల్కంపేట, బాణాపూర్, కొర్పోల్ గ్రామాల్లోని దళిత కుటుంబాలకు 20 యూనిట్ల్ల చొప్పున మంజూరు చేశాను. మిగిలినవి నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో అందించాను. నా సొంత మండలమైన లింగంపేటలోని ఈ మూడు గ్రామాల్లో దళితబంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు ఓ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాను.
లబ్ధిదారులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా?
నేను ఒక్కటే చెబుతాను. మన దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని పథకం దళితబంధు మాత్రమే. ఇలాంటి పథకాలను అమలు చేసేందుకు గతంలో ఏలిన పాలకులు కనీసం ఆలోచన కూడా చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దళిత కుటుంబాల దీన పరిస్థితులను చూసి చలించి అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నిర్మించాలనే యోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. లబ్ధిదారులంతా రూ.10లక్షలతో తమ బతుకులను మార్చుకోవాలి. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేయాలంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. మీకు నచ్చిన యూనిట్ను స్థాపించుకుని మీరే యజమానిగా మారాలి. కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని కోరుతున్నాను.
దళితబంధు పథకాన్ని ఎల్లారెడ్డిలో అమలు చేయడం, ఈ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా మీ ఫీలింగ్ ఏంటి?
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు పథకం ఎంతో విశిష్టమైనది. ఈ పథకాన్ని దేశంలోని మరే ఇతర పథకంతో పోల్చడానికి వీల్లేదు. ఈ పథకం చాలా గొప్పది. దళితుల బతుకులను మార్చడానికి ఉద్దేశించిన ఈ పథకం చరిత్రలో నిలిచి పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా 100 మందికి అమలు చేస్తుండడం సంతోషంగా ఉంది. అందులో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ వంద మంది లబ్ధిదారులను పక్కాగా, పారదర్శకంగా గుర్తించాం. నియోజకవర్గంలో అట్టడుగు వర్గానికి ఇంత అద్భుతంగా సేవ చేసుకునే అవకాశం కల్పించిన సీఎంకు ధన్యవాదాలు. మొదటగా ఇప్పుడు అమలు చేయబోయే యూనిట్లు పరిమితంగా ఉన్నందున వీరంతా భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని కొన్ని యూనిట్లకు పేదరికంతో పాటు ఆయా రంగాల్లో అనుభవం, చదువు వంటి అర్హతలను ప్రాతిపదికగా తీసుకున్నాము.